ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

business |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 10:03 PM

 స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి నిరాశే మిగిల్చింది. తాజాగా కేంద్రం.. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికాలకు కొత్తగా ప్రకటించిన రేట్లు వర్తిస్తాయి. ఏప్రిల్ 1, 2025 నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఈ క్రింది రేట్లలో వడ్డీని పొందుతాయని ఒక ప్రకటనలో తెలిపింది ప్రభుత్వం. దీంతో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్స్ ఇలా అన్ని పథకాల్లో వడ్డీ రేట్లను మార్చలేదు. యథాతథంగానే ఉన్నాయని గుర్తుంచుకోవాలి.


తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (జనవరి- మార్చి) నోటిఫై చేసిన వడ్డీ రేట్లే ఇప్పుడు ఏప్రిల్- జూన్ సమయానికి కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక కేంద్రం ఈ స్కీమ్స్ వడ్డీ రేట్లను మార్చకపోవడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. చివరిసారి కేంద్రం.. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ స్కీమ్స్ వడ్డీ రేట్లు కేంద్రం సవరించింది. అప్పుడు మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.10 శాతానికి.. సహా సుకన్య సమృద్ధి వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.20 శాతానికి కేంద్రం పెంచింది. ఇక ప్రతి 3 నెలలకు ఓసారి కేంద్రం ఈ వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది.


ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో 7.10 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో 7.7 శాతం వడ్డీ రేటు కొనసాగుతోంది. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ కింద అత్యధికంగా 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. ఇదే సమయంలో సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు కూడా 8.20 శాతంగానే ఉంది.


ఇతర పథకాల విషయానికి వస్తే.. పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లపై కూడా 4 శాతం వద్ద స్థిరంగానే వడ్డీ రేట్లు ఉన్నాయి. టైమ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. ఏడాది టెన్యూర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.9 శాతంగా ఉండగా.. రెండేళ్ల టెన్యూర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 7 శాతంగా కొనసాగుతోంది. మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్లపై 7.10 శాతం, ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై 7.50 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.


ఇక ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్‌పై ఏప్రిల్- జూన్ సమయానికి 6.7 శాతం వడ్డీ రేటు ఉండగా.. మంత్లీ ఇన్‌కం అకౌంట్ స్కీమ్ వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్ర పథకం వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది. ఇక్కడ సరిగ్గా 115 నెలల్లో పెట్టుబడి డబుల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com