ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమవారం అలా చేయాల్సిందే..బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

business |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 10:04 PM

 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న తరణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బ్యాంకులు ప్రత్యేక క్లియరింగ్ కార్యకలాపాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది. సీటీఎస్ ప్రత్యేక క్లియరింగ్ ప్రకారం, చెక్కులు సమర్పించే సమయం సాయంత్రం 5:00 నుంచి 5:30 వరకు ఉంటుంది. వాటిని తిరిగి పంపే సమయం రాత్రి 7:00 నుండి 7:30 వరకు ఉంటుంది. ప్రభుత్వ ఆదాయం, పన్ను చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీలు సజావుగా కొనసాగేలా ఈ చర్యలు తీసుకుంది. ముగింపు రోజే ప్రభుత్వ ఆదాయం, ఖర్చులు, చెల్లింపులు పూర్తవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమయానికి పూర్తవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించాల్సిన బ్యాంకులు విధిగా పనిచేయాలని స్పష్టం చేసింది.


ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన లావాదేవీలు జాప్యం లేకుండా జరిగే అవకాశముంది. సాధారణంగా మార్చి 31న రంజాన్ నేపథ్యంలో సెలవు ఉంది. కానీ టాక్స్ పేమెంట్లు, ఐటీఆర్ ఫైలింగ్ ఇలా వీటికి సంబంధించి గడువు తీరనున్న తరుణంలో ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఇక కేవలం బ్యాంకులే కాకుండా, పన్ను శాఖ కార్యాలయాలు కూడా మార్చి 29, 30, 31 తేదీల్లో పని చేయనున్నాయి. ఆదాయపు పన్ను విభాగం, సీజీఎస్టీ కార్యాలయాలు ఈ మూడు రోజులు పని చేస్తాయి. మార్చి 31న రంజాన్ ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో కార్యాలయాలు తెరిచే ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న పన్ను చెల్లింపులు, లావాదేవీలు పూర్తి చేసేందుకు ఇది చక్కటి అవకాశంగా భావించాలి. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.


కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందు.. మీ ఐటీఆర్ ఫైలింగ్, పన్ను మినహాయింపులను సరిచూసుకోవడం అవసరం. పెట్టుబడులను సమీక్షించుకోవాలి. ఏ పెట్టుబడులు లాభదాయకంగా మారాయి? వేటిల్లో మార్పు అవసరం? అనేది పరిశీలించాలి. బీమా పాలసీలను అప్‌డేట్ చేయడంపై దృష్టి సారించాలి. ఇక్కడ మీ ఆదాయం పెరిగినట్లయితే, బీమా రక్షణను కూడా పెంచుకోవాలి. ఖర్చులు, ఆదాయం, పెట్టుబడుల సమతుల్యత పాటిస్తూ.. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మార్చి 31లోపు అవసరమైన.. బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిచేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com