ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్కార్ సంచలన నిర్ణయం.. చెత్తపై పన్ను, ఏడాదికి ఎంతంటే?

national |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 08:33 PM

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేకపోవడంతో.. నిధుల సేకరణకు ప్రజలపై పన్నుపోటు వేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సు ఛార్జీలు, మెట్రో ఛార్జీలు, వాహనాల రిజిస్ట్రేషన్ ధరలు.. పాలు, పెరుగు ధరలు.. విద్యుత్ ఛార్జీల పెంపు, వాటర్ ఛార్జీల పెంపు, స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఔట్ పేషంట్ ఫీజులు, పోస్ట్‌ మార్టమ్‌ ఎగ్జామినేషన్‌ ఛార్జీలు, మెడికల్‌ సర్టిఫికెట్‌ ఫీజులను పెంచింది.


ఇప్పటికే ఇవన్నీ ఛార్జీల పెంపుతో కర్ణాటక ప్రజలపై భారం మోపిన సిద్ధరామయ్య ప్రభుత్వం.. తాజాగా కొత్తగా చెత్త సేకరణపైనా గార్బేజ్ సెస్‌ను విధించింది. బెంగళూరు నగరంలో వ్యర్థాల నిర్వహణ కోసం బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక -బీబీఎంపీ.. ఈ చెత్త సెస్‌ను వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యర్థాల సేకరణ కోసం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి యూజర్‌ ఛార్జీలను వసూలు చేయనున్నట్టు బీబీఎంపీ వెల్లడించింది. భవనం విస్తీర్ణం ఆధారంగా ఈ యూజర్ ఛార్జీలను నిర్ణయించింది. 600 చదరపు అడుగులలోపు విస్తీర్ణం ఉన్న నివాస భవనాలకు ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.10 (ఏడాదికి రూ.120) యూజర్‌ ఛార్జీలుగా వసూలు చేయనున్నారు.


అదే విధంగా 4 వేల చదరపు అడుగులు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం గల భవనాలకు ప్రతి ఇంటికి నెలకు రూ.400 (ఏడాదికి 4,800) యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు.. వాణిజ్య భవనాలకు కేజీకి రూ.12 చొప్పున తీసుకోనున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్-ఎస్‌డబ్ల్యూఎమ్ ఫీజు పేరుతో ఈ చెత్త పన్నును కర్ణాటక ప్రభుత్వం వసూలు చేస్తోంది. బెంగళూరు నగరంలోని చెత్తను సేకరించి.. మరింత మెరుగ్గా డిస్పోజ్ చేసేందుకు ఈ పన్నును అమల్లోకి తీసుకువచ్చామని బీబీఎంపీ అధికారులు వెల్లడించారు. ఈ చెత్త పన్నుతో బీబీఎంపీకి రూ.685 కోట్ల ఆదాయం సమకూరనుందని తెలిపారు.


ఇక ఈ చెత్త పన్నుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ఛార్జీలను పెంచుతూ ప్రజల రక్తం తాగుతున్న సిద్ధరామయ్య సర్కార్‌ ధరల పెంపు దయ్యం లాగా మారిందని కేంద్రమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ పాలన గతంలో దేశాన్ని పాలించిన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తరహాలో ఉందని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa