బెంగళూరు నగరంలోని ఓ వీధిలో గుర్తు తెలియని యువకుడు.. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆ రాష్ట్ర హోంమంత్రి షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవలే బెంగళూరులో రోడ్డుపై నడుచుకుంటూ ఇద్దరు అమ్మాయిలు వెళ్తుండగా.. ఓ వ్యక్తి వచ్చి అందులోని ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. బెగంళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతాయని హోమంత్రి జి పరమేశ్వర తెలిపారు. వీటిని అడ్డుకునేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు. మంత్రి చేసిన ఈ కామెంట్లపై ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచుగా ఇలా జరుగుతున్నాయని చెప్పడానికి బదులుగా వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
గత వారం సుద్దగుంటెపాల్య ప్రాంతంలోని భారతి లేఅవుట్ వీధిలో ఓ ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా వారి వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. అందులోని ఓ మహిళను అసభ్యంగా తాకాడు. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా భయపడిపోయిన అమ్మాయిలు కూడా అక్కడి నుంచి పరుగుపరుగునా వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ వీడియో రికార్డు కాగా.. దాన్ని గుర్తించిన కొందరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా నెట్టింట వైరల్గా మారింది.
ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే సదరు నిందితుడిని గుర్తించి అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరనే తెలిపారు. ముఖ్యంగా ఈ ఘటన గురించి స్పందిస్తూ.. బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఈ కేసులోని నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూనే.. ఇప్పటికే ఈ విషయం గురించి కమిషనర్తో మాట్లాడనని చెప్పారు.
అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అయితే హోంమంత్రి జి పరమేశ్వర చేసిన కామెంట్లపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతాయని చెప్పడం దారుణం అని వివరిస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసిన వెంటనే అడ్డుకొని, ఆకతాయిలకు బుద్ధి చెప్పాల్సింది పోయి ఇలా మాట్లాడడం సరికాదని.. ఇకనైనా మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా చూస్కోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa