ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్ చట్టాన్ని అస్సలే అమలు చేయను: మమతా బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 08:44 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వక్ఫ్ సవరణ బిల్లు చట్టంపై పశ్చిమ బెంగాల్ ప్రజలు సైతం దీన్ని వ్యతిరేకిస్తుండగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్లు చేశారు. ముస్లిం ప్రజల ఆస్తులను కాపాడతానంటూనే.. రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోనని వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. లోక్‌సభలో సుదీర్ఘ చర్చ తర్వాత ఏప్రిల్ 3వ తేదీన వక్ఫ్ సవరణ బిల్లు-2025కి ఆమోదం లభించింది. ముఖ్యంగా లోక్‌సభలో 288 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా.. 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇలా లోక్‌సభ నుంచి ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లగా.. ఏప్రిల్ 4వ తేదీన ఓటింగ్ జరిపారు. ఇలా ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో రెండు సభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లును ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపారు. ఆమె వెంటనే ఆమోదం తెలపడంతో ఈ బిల్లు చట్టంగా మారింది. అలా దీన్ని ఏప్రిల్ 8వ తేదీ నుంచే అమలు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేష్ విడుదల చేసింది.


వక్ఫ్ చట్టం అమల్లోకి రాగా.. దేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని అస్సలే అమలు చేయకూడదంటూ ర్యాలీలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల ప్రజలు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముర్షిదాబాద్‌లో అయితే నిరసనకారులు, పోలీసుల మధ్య గొడవ జరిగి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక పోలీసు వాహనాలు మంటల్లో దగ్ధం అయ్యాయి. మరోవైపు అదే రాష్ట్రంలోని కోల్‌కతాలో జైన సమాజం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈక్రమంలోనే అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.


మైనార్టీ ప్రజలను కాపాడటమే కాకుండా వారి ఆస్తులను సైతం తానే రక్షిస్తానని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. వక్ఫ్ చట్టం అమలు కారణంగా ప్రజలు బాధ పడుతున్నారని తనకు తెలుసని, పశ్చిమ బెంగాల్‌లో విభజించి పాలించేదేమీ ఉండదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 శాతం మంది ముస్లింలు ఉన్నారని.. వారు శతాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నారని గుర్తు చేశారు. వారందరినీ కాపాడాల్సిన బాధ్యత సీఎంగా తనపై ఉందని వివరించారు. తనను మైనార్టీ ప్రజలంతా నమ్మాలని.. రాష్ట్రంలో అస్సలే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయనని పేర్కొన్నారు. ఇక్కడ ఉంది దీదీ అని, దీదీ మిమ్మల్ని మీ ఆస్తులను ఎప్పటికీ కాపాడుతుందని ముస్లిం ప్రజలకు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa