ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికి.. ఆశించిన మేర రాణించలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్.. ఎట్టకేలకు రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 166/7 పరుగులు స్కోరు చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రిషభ్ పంత్ సారథ్యంలోనే లక్నో సూపర్ జెయింట్స్కు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తూ.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సీఎస్కే.. ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. తుది జట్టులోనూ రెండు మార్పులు చేసింది.
అయితే లక్నో సూపర్ జెయింట్స్కు ఈ సీజన్లో శుభారంభాలు అందించిన ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్లో 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నికోలస్ పూరన్ సైతం సింగిల్ డిజిట్కే వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ (49 బంతుల్లో 63 రన్స్), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 30 రన్స్)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కిదిద్దాడు. అయితే రిషభ్ పంత్ చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్నా.. తన స్టైల్లో ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. నిదానంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో స్కోరు బోర్డు నిదానంగా కదిలింది.
ఆయుష్ బదోనీ (22), అబ్దుల్ సమద్ (20) రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్.. 7 వికెట్ల నష్టానికి 166 రన్స్ స్కోరు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మతీశ పథిరన 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa