ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. రూ. 3 కోట్ల లోపు విలువైన డిపాజిట్లపై స్వల్ప, మధ్య కాలవ్యవధిలో ఈ తగ్గింపులు వర్తిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. కీలక రెపో రేట్లను ఇటీవల 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని బ్యాంకులు కూడా రెపో రేటుకు లింక్ అయి ఉన్న రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తుంటాయి. ఇదే సమయంలో ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఇక్కడ మరో కీలక ప్రకటన చేసింది. 7.30 శాతం మేర అధిక వడ్డీ రేటును అందించిన 400 రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని బ్యాంకు తాజాగా నిలిపివేసింది. అంటే ఇక మీదట ఈ స్పెషల్ టెన్యూర్ పథకంలో డిపాజిట్లు చేయలేరన్నమాట. ఈ సవరించిన వడ్డీ రేట్లు 2025, ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్ను నిలిపివేయగా.. 444 రోజుల వ్యవధి ఉన్న అమృత్ వృష్టి పథకం వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ క్రమంలోనే మరో ప్రభుత్వ బ్యాంకు షాకిచ్చిందని చెప్పొచ్చు.
మిగతా టెన్యూర్లను పరిశీలిస్తే.. 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.50 శాతం నుంచి 4.25 శాతానికి చేర్చారు. 180 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై రేటును 6.00 శాతం నుంచి 5.75 శాతానికి (25 బేసిస్ పాయింట్ల తగ్గింపు) తగ్గించారు. ఒక సంవత్సరం కాలవ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7% నుంచి 6.80%కి తగ్గించారు. అయితే, ఉపసంహరించిన 400 రోజుల పథకాన్ని మినహాయించి, ఒక సంవత్సరం కంటే ఎక్కువ మరియు రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి కలిగిన ఎఫ్డిలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.80% నుంచి 6.75%కి చేర్చారు.
సీనియర్ సిటిజన్లకు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై 6 నెలలు, అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ వ్యవధికి అదనంగా 0.50 శాతం వడ్డీ రేటును అందిస్తారు. సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.65% వడ్డీ రేటు లభిస్తుంది. ఇక మెచ్యూరిటీకి ముందే ఎఫ్డీలను విత్డ్రా చేస్తే వర్తించే ఛార్జీల విషయానికి వస్తే, రూ. 5 లక్షల కంటే తక్కువ డిపాజిట్లను 12 నెలలు పూర్తయిన తర్వాత విత్డ్రా చేస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. అయితే, రూ. 5 లక్షల కంటే తక్కువ డిపాజిట్లను 12 నెలల కంటే ముందుగా విత్డ్రా చేస్తే 0.50% ఛార్జీ వర్తిస్తుంది. రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై ముందస్తు ఉపసంహరణకు 1 శాతం ఛార్జీ వర్తిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa