ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో యూట్యూబర్ నిర్వాకం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 09:19 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో డ్రోన్ కలకలం రేపింది. శ్రీవారి ఆలయంతో పాటుగా ఆ పరిసర ప్రాంతంలో డ్రోన్‌ కెమెరా ఎగరడం కలకలం రేపింది. పది నిమిషాల పాటు డ్రోన్ చక్కర్లు కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే రాజస్థాన్‌కు చెందిన భక్తుడు ఈ డ్రోన్ కెమెరాను ఎగరవేసినట్లు తెలిసింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ ఎగరటంపై భక్తులు మండిపడుతున్నారు. అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే తిరుమలలో ఇదేంటీ అంటూ మండిపడుతున్నారు.


మరోవైపు గతేడాది కూడా ఇలాంటి ఘటన తిరుమలలో కలకలం రేపింది. హర్యానా భక్తుడు డ్రోన్ ఎగరేయడం కలకలం రేపింది. అయితే తిరుమల నిబంధనలు తెలియక అప్పట్లో భక్తుడు డ్రోన్ ఎగరేసినట్లు టీటీడీ తెలిపింది. తాజాగా జరిగిన ఘటనలో రాజస్థాన్ భక్తుడు కావాలని డ్రోన్ ఎగరవేశారా లేదా.. టీటీడీ నిబంధనలు తెలియక ఇలాంటి పని చేశాడా అనేది తెలియాల్సి ఉంది. డ్రోన్ ఎగరేసిన భక్తుడిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.


మరోవైపు తిరుమలలో డ్రోన్ సంచారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. డ్రోన్ ఎగురవేసింది ఓ యూట్యూబర్‌ అని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అనే యూట్యూబర్ మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేసినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.


మరోవైపు తిరుమలలో ఇటీవల కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు భక్తులు తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు చెప్పులతో వచ్చారు. మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముకేష్ అనే భక్తులు ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. శ్రీవాణి టికెట్ మీద శ్రీవారిని దర్శనానికి వచ్చారు. దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 మీదుగా ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్నారు.


అయితే మహద్వారం వద్దనున్న సిబ్బంది.. ఇద్దరు భక్తులు డిస్పోజబుల్ ఫుట్ వేర్ ధరించిన విషయాన్ని గుర్తించారు. వెంటనే వాటిని తొలగింపజేశారు. అయితే ఈ ఘటనతో విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సిబ్బంది సరిగా తనిఖీ చేయకపోవటంతోనే భక్తులు చెప్పులతో ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న విషయం వెల్లడైంది. దీంతో ఈ ఘటనపై టీటీడీ సీరియస్ అయ్యింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఏడుగురు ఉద్యోగులను విధుల నుంచి తప్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa