ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాఖపట్నంలో 99 పైసలకే,,,,టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు 21 ఎకరాల భూమి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 09:25 PM

విశాఖపట్నం త్వరలో ఐటీ హబ్‌గా మారనుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో టీసీఎస్‌కు ఏకంగా 21.16 ఎకరాల భూమిని నామమాత్రపు ధర, అంటే కేవలం 99 పైసలకే (టోకెన్ ధర) కేటాయించేందుకు నిర్ణయించింది. సంవత్సరానికి 99 పైసల లీజు అన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాటా మోటార్స్‌కు 99 పైసలకే భూమిని కేటాయించిన విధానాన్నే చంద్రబాబు సర్కార్ అనుసరించినట్లు తెలుస్తోంది. అప్పట్లో మోదీ తీసుకున్న నిర్ణయం గుజరాత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడింది. ఇప్పుడు ఏపీ సర్కార్ చర్య విశాఖపట్నాన్ని ఒక ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతోంది.


టీసీఎస్ రాకతో విశాఖపట్నంలో ఐటీ విప్లవం మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా టీసీఎస్ దాదాపు రూ. 1,370 కోట్లు పెట్టుబడి పెట్టనుంది, తద్వారా సుమారు 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.


మంత్రి నారా లోకేష్.. గతేడాది అక్టోబర్‌లో ముంబైలో టీసీఎస్ ఉన్నతాధికారులతో సమావేశమై విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆహ్వానించారు. దీనికి కొనసాగింపుగా ఈ కేటాయింపు జరిగింది. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో కనీసం 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికకు హాజరైన చంద్రబాబు నాయుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "విశాఖపట్నం ఒక ఐటీ విప్లవాన్ని చూస్తుంది." అని ఆయన అన్నారు.


టీసీఎస్ విశాఖపట్నంలో 90 రోజుల్లో అద్దె భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. అయితే, అత్యాధునిక శాశ్వత ప్రాంగణం నిర్మాణం పూర్తి కావడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాంగణంలో 10,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.


ప్రభుత్వం ఇతర టెక్ కంపెనీలతో కూడా చర్చలు జరుపుతోంది. విశాఖపట్నాన్ని దేశంలోనే ఒక ప్రధాన టెక్నాలజీ డెస్టినేషన్‌గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కేవలం 99 పైసలకే భూమిని కేటాయించడం ద్వారా, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంకేతాలు పంపుతోంది. అంటే.. పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను అనుసరించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉందని తెలియజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa