ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లక్ష్మీబాయి కళాశాలలోని అనేక తరగతి గదులకు ఎక్కువగా వెంటిలేషన్ లేదు. దీంతో ఎక్కువగా ఉక్కపోస్తుంటుంది. అసలే వేసవి కాలం కావడం.. అందులోనూ ఎండలు మండిపోతుండగా విద్యార్థులు, ఉపాధ్యాయులు నరకం చూస్తున్నారు. తరచుగా దీనిపై ప్రిన్సిపల్కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ గదిలో నాలుగైదు ఫ్యాన్లో, ఓ ఏసీయో పెట్టించాలని కోరుతున్నారు. కానీ ప్రిన్సిపల్ ప్రత్యూష వత్సల మాత్రం ఆ గదని చల్లగా మార్చేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఓ పని చేశారు.
ప్రత్యేకంగా ఆవుపేడ తెప్పించి దాంట్లో కొన్ని నీళ్లు కలిపి మరీ తరగతి గోడలకు పూశారు. అలా చేస్తుండగా వీడియో తీయించుకుని మరీ సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే అధ్యాపకుల పరిశోధన ప్రతిపాదనలో భాగంగానే ఈ పని చేసినట్లు చెప్పారు. గది గోడలకు ఆవుపేడ రాయడం వల్ల చాలా చల్లగా ఉంటుందని.. దానికి ఉష్ణోగ్రతను అడ్డుకునే సామర్థ్యం ఉంటుందని వివరించారు. ఇది జరిగి రెండ్రోజులు కావొస్తుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు ప్రిన్సిపల్ ప్రత్యూష వత్సల చేసిన పనిని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇలా చేయడం అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే తాజాగా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షుడు రోనక్ ఖత్రి నేతృత్వంలోని విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పిల్లల గదిలో ఏసీ పెట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆవుపేడ రాయడంపై చాలా కోపంగా ఉన్న వాళ్లు.. ప్రిన్సిపల్ ప్రత్యూష వత్సల ఆఫీసులోని గోడలపై కూడా ఆవుపేడను పూశారు. ఆపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ.. ప్రిన్సిపల్ మేడమ్ గదికి కూడా పేడ పూశాం కాబట్టి చల్లగా ఉంటుందని.. ఇక ఈ గదిలో ఉన్న ఏసీని తీసేసి విద్యార్థులకు ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పారు. ఆవుపేడతో వచ్చే చల్లదనంలోనే మేడమ్ వేసవి కాలం అంతా విధులు నిర్వహిస్తారని తాము బలంగా నమ్ముతున్నామంటూ కామెంట్లు చేశారు.
అక్కడితో ఆగకుండా అసలు విద్యార్థుల సమ్మతి లేకుండా.. గది గోడలకు ఆవుపేడ పూయడం ఏంటని రోనక్ ఖత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వాసన వల్ల పిల్లలు గదుల్లో కూడా కూర్చోలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రయోగాలు ఏమైనా ఉంటే ప్రిన్సిపల్ మేడమ్.. తన ఇంట్లో చేసుకోవాలని, విద్యార్థులను ఇబ్బంది పెడితే ఏమాత్రం సహించమని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతుండగా.. అనేక మంది స్పందిస్తున్నారు. మంచి పని చేశారు, ఆవుపేడ వాసన పీల్చుకుంటూ అదే గదిలో మేడమ్ చల్లగా కూర్చుని పనులు చేసుకుంటారంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa