ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల వన్డే వరల్డ్ కప్ భారత్‌కు పాక్ జట్టు రాదన్న పీసీబీ

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 09:43 PM

భారత్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక ప్రకటన చేసింది. తమ మహిళల జట్టు టోర్నమెంట్ కోసం భారత్‌కు రాదని, గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడుతుందని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శనివారం స్పష్టం చేశారు.ఇటీవల కుదిరిన 'హైబ్రిడ్ మోడల్' ఒప్పందాన్ని అనుసరించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నఖ్వీ వివరించారు. గతంలో పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఆ సమయంలో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. ఈ నేపథ్యంలో, ఇరు దేశాల్లో ఎవరు ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చినా, రెండో దేశం తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడేలా 'హైబ్రిడ్ మోడల్'కు అంగీకారం కుదిరింది."ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ ఎలాగైతే పాకిస్థాన్‌లో ఆడకుండా తటస్థ వేదికపై ఆడిందో, మేం కూడా అదే విధానాన్ని పాటిస్తాం. ఏ వేదిక ఖరారైతే అక్కడ ఆడతాం. ఒప్పందం కుదిరినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి" అని మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్నందున భారత్, ఐసీసీ కలిసి పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసం తటస్థ వేదికను నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు.ఈ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు భారత్‌లో ఈ మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. ఆతిథ్య భారత్‌తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.ఇటీవల లాహోర్‌లో జరిగిన క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి వ్యక్తం చేశారు. క్వాలిఫయర్స్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లప) విజయం సాధించి ప్రపంచకప్‌కు అర్హత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa