ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. ఏటీఎం (ఆటోమేటెడ్ టెలర్ మెషిన్) ట్రాన్సాక్షన్ల ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఏటీఎం లావాదేవీల ఛార్జీలను సవరించినట్లు స్పష్టం చేసింది. మే 1, 2025 నుంచి బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన ప్రతి లావాదేవీకి రూ. 23 ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఛార్జీలు రూ. 21 గా ఉన్నాయి. ఏటీఎం ఛార్జీలు పెంచిన విషయాన్ని తమ కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్లు బ్యాంకు తెలిపింది.
మే 1, 2025 నుంచే సవరించిన ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా, నిధుల బదిలీ వంటి లావాదేవీలకు ఇకపై ఒక్కో ట్రాన్సాక్షన్కు రూ. 23 ఫీజు వసూలు చేస్తామని బ్యాంక్ తెలిపింది. అయితే బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్ మెంట్ వంటి ఇతర ట్రాన్సాక్షన్లకు రూ. 10 ఛార్జీలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఇవి రూ. 21, రూ. 8.50 గా ఉన్నాయి. అయితే ఈ బ్యాంకు తమ కస్టమర్లకు ప్రతి నెల ఏటీఎం ద్వారా ఉచితంగా 5 లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తాయి.
బ్యాంకు ఖాతాను బట్టి ఒక రోజులో గరిష్ఠ ఉప సంహరణ పరిమితి వేరు వేరుగా ఉంటుంది. కోటక్ ఎడ్జ్, ప్రో, ఎస్ అకౌంట్లలో రూ. 1,00,000 వరకు ఒక రోజులో విత్ డ్రా చేసుకోవచ్చు. అదే ఈజీ పే ఖాతా అయితే రూ. 25,000 వరకే ఉపసంహరించుకోవచ్చు. కార్డు లేదా అకౌంట్ రకాన్ని బట్టి ఈ లిమిట్ అనేది మారుతుంది. కొన్ని కార్డులకు రూ. 50 వేల వరకు లిమిట్ ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు గత మార్చి నెలాఖరులోనే ప్రకటించింది. కార్యకలాపాల ఖర్చులు, ఏటీఎంల నిర్వహణ భారం పెరిగినందువల్లే ఈ మేరకు ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతకు ముందు 2021 మార్చి నెలలో ఏటీఎం ఛార్జీలు పెంచింది. ఇప్పుడు మరోసారి సవరించింది. మే 1, 2025 నుంచే ఈ కొత్త ఛార్జీలు అమలవుతాయని ఆర్బీఐ కొద్ది రోజులుగా చెబుతోంది. ఈ నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంకు ఏటీఎం ఛార్జీల పెంపును అమలులోకి తీసుకొస్తుండడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa