ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసరావుపేటలో 'యానిమేషన్‌' మోసం.. రూ.400 కోట్లతో పరార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:01 PM

వరుస ఆర్థిక మోసాలతోవార్తల్లో నిలుస్తున్న గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. విజయవాడను కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ యానిమేషన్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ యజమాని భారీ మోసానికి పాల్పడ్డాడు. స్థానికుల వద్ద నుంచి రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దేశవిదేశాల్లో పలు సినిమాలకు యానిమేషన్ సేవలు అందిస్తున్నామని నమ్మబలికి సుమారు రూ.400 కోట్ల మేరను ఎగవేసి సంస్థ యజమాని పరారయ్యాడు. నరసరావుపేటలోనే 80 మందికిపైగా వ్యాపారులు అతని వద్ద పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.


బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఏడాదిలో అదనంగా లక్ష రూపాయల లాభం వస్తుందని హామీ ఇచ్చి.. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి నరసరావుపేటలోని ప్రముఖ వ్యాపారులను నమ్మబలికాడు. మొదట ఇద్దరు ప్రముఖ వ్యాపారులు రూ.10 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టగా.. వారి మద్దతుతో మరికొంతమందిని కూడా ఆకర్షించాడు. ఒక్క నరసరావుపేటలోనే వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు రూ.కోటి నుంచి రూ.50 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.


సొంతంగా పెట్టుబడి పెట్టే స్థోమత లేని వారు కూడా అధిక వడ్డీకి ఆశపడి అప్పులు చేసి మరీ ఇతని వద్ద పెట్టుబడులు పెట్టారు. మెుత్తంగా రూ.400 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. మొదట రూ.కోటి పెట్టుబడి పెడితే 13 నెలల తర్వాత రూ.1.75 కోట్లు చెల్లించి నమ్మకం సంపాదించాడు. దీంతో అధిక డబ్బులు వస్తున్నాయని.. మరింతమంది పెట్టుబడులు పెట్టారు. అయితే గత నాలుగేళ్లుగా నడుస్తున్న సంస్థ ఇటీవల రెండు నెలలుగా వడ్డీలు ఇవ్వకపోవడంతో పెట్టుబడి పెట్టిన వారిలో కలవరం మొదలైంది. అయితే సదరు వ్యక్తి మాత్రం బాధితులందరికీ అందుబాటులోనే ఉంటూ వారికి సమాచారం ఇస్తుండేవారు.


ఇటీవల రెండువారాల నుంచి అతడు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో పెట్టుబడులు పెట్టిన వారంతా మోసపోయామని గ్రహించారు. కొందరు వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పెట్టుబడులు మరికొందరు బాధితులు మాత్రం ముందుకు రావటం లేదు. పెట్టిన బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలిసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa