ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లొచ్చి ఆస్పత్రిలో చేరిన బెంగాల్ గవర్నర్

national |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:14 PM

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ గొడవల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలోనే బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్.. బాధితులతో కలిసి మాట్లాడారు. అండగా ఉంటామని హామీలు కూడా ఇచ్చారు. ఆపై ఇంటికి వెళ్లిన ఆయనకు ఉన్నట్టుండి ఛాతి నొప్పి వచ్చింది. ఫలితంగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని ఈస్ట్రన్ కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ్ బెంగాల్‌లో మొదలైన నిరసనలు హింసకు దారితీశాయి. బెంగాల్‌ జిల్లాల్లో హింసాత్మక ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది గాయపడ్డారు. ఇది జరిగి వారం రోజులకు పైనే అవుతున్నా.. అల్లర్లు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఈ అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్. శనివారం రోజు రాత్రి ముర్ధిదాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లోని బాధితులను కూడా కలిశారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీలు కూడా ఇచ్చారు. ఎవరూ భయపడొద్దని సూచించారు.


ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల్లో అభద్రతా భావం నెలకొందని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వెల్లడించారు. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామని కూడా చెప్పారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలను తనకు తెలియజేసేలా తన కార్యాలయం ఫోన్ నెంబల్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటికి చేరుకున్న కాసేపటికే కుటుంబ సభ్యులతో తనకు ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పారు.


కొన్ని క్షణాల్లోనే నొప్పి ఎక్కువై కుప్పకూలిపోగా.. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కోల్‌కతాలోని ఈస్ట్రన్ కమాండ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే పరీక్షించిన వైద్యులు గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులకు వివరించగా.. వారు ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa