ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో కుటుంబ సమేతంగా ల్యాండ్ అయిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్

national |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:18 PM

అమెరికా వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ అల్లుడు జేడీ వాన్స్ మన భరత గడ్డపై కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ ఉదయం ఢిల్లీలో ఆయన ల్యాండ్ అయ్యారు. కాసేపట్లో ఆయన భారత ప్రధాన మోదీని కలవనున్నారు. అత్యున్నతమైన ఈ భేటీలో మోదీ, వాన్స్ పలు అంశాలపై చర్చించనున్నారు. అధికారికంగా అందుతున్న సమాచారం మేరకు మోదీ, వాన్స్ ఇప్పటికే నిర్ధారితమైన ఉభయ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించనున్నారు. అంతిమంగా ఈ చర్చలు ఉభయ దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేలా ఉండబోతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ విందును ఇవ్వబోతున్నారు. ప్రధాని మోదీకి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్ కారణంగా ఇప్పటికే ప్రపంచం రెండు ముక్కలయిందనేది అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయం. యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ ధోరణిపై గుర్రుగా ఉంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్న చైనా ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థతుల్లో అమెరికాకు భారత్ మద్దతు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన అటు అమెరికాకు, ఇటు ఇండియాకు అత్యంత కీలకం కాబోతోంది.జేడీ వాన్స్ భార్య ఉష మన తెలుగు మహిళ అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కుటుంబంలో ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అయ్యారు. యూనివర్సిటీలో చదువుకునే సమయంలో ఉషకు వాన్స్ పరిచయం అయ్యారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి చివరకు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మన తెలుగింటి అల్లుడు మన దేశానికి రావడం మనం సంతోషించాల్సిన విషయం. మరోవైపు వాన్స్ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈ దంపతులు ఏపీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa