చెక్ బౌన్స్ కేసులో భాగంగా విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు.. ఓ వ్యక్తిని దోషిగా తేల్చింది. ఈక్రమంలోనే మహిళా న్యాయమూర్తి.. సదరు వ్యక్తికి జరిమానాతో పాటు శిక్షను విధించారు. అయితే తనకు ఎంతమాత్రం జడ్జి అనుకూలంగా తీర్పు చెప్పకపోవడంతో తీవ్ర కోపోద్రిక్తుడు అయిన దోషి.. మహిళా న్యాయమూర్తిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు చేతికి అందిన ఓ వస్తువును ఆమె పైకి విసిరి మరీ.. నేనెవరో మీకు తెలీదు, బయటకైతే రండి.. ప్రాణాలతో ఇంటికెళా వెళ్తారో నేనూ చూస్తానంటూ వ్యాఖ్యానించాడు. ఇందుకు ఆయన తరఫు న్యాయవాది కూడా వత్తాసు పలుకుతూ సదరు జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీకి చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ పాఠాశల ఉపాధ్యాయుడు ఓ చెక్ బౌన్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీ కోర్టులో ఈయన కేసు విచారణ జరిగింది. ఈక్రమంలోనే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద నిందితుడిని దోషిగా తేల్చారు మహిళా న్యాయమూర్తి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దోషి మహిళా జడ్జిపై వేధింపులకు పాల్పడ్డారు. కోర్టు గదిలో ఉండగానే.. నీ అంతు చూస్తానంటూ హెచ్చరించాడు. నీవైతే బయటకు రా.. ప్రాణాలతో ఇంటికి ఎలా వెళ్తావో చూస్తానంటూ వ్యాఖ్యానించాడు. దోషి ప్రవర్తనతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. జడ్జి సైతం ఏం చేయాలో తెలియక నోరెళ్లబెట్టారు.
మరోవైపు దోషి తరఫున వాదిస్తున్న అతుల్ కుమార్ అనే లాయర్.. అతడిని అడ్డుకోకుండా, దోషికే వత్తాసు పలికారు. నిందితుడిపై కేసు కొట్టేయాలని, లేకపోతే బాగోదంటూ జడ్జికి హెచ్చరికలు జారీ చేశారు. ఈక్రమంలోనే నిందితుడు.. న్యాయమూర్తిపైకి ఓ వస్తువును కూడా విసిరాడు. అయితే అదృష్టవశాత్తు అది అంత దూరం వెళ్లలేదు. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన అతడు న్యాయమూర్తి కుటుంబ సభ్యులను కూడా ప్రస్తావిస్తూ.. దుర్భాషలాడాడు. తీర్పు మార్చమని, తనను విడుదల చేయాలని ఒత్తిడి చేశాడు. లాయర్ అతుల్ కుమార్ కూడా.. తన క్లయింట్ను విడుదల చేయాలని, లేదంటే పదవి నుంచి తప్పుకోవాలంటూ జడ్జిపై వేధింపులకు పాల్పడ్డారు.
దీంతో మహిళా న్యాయమూర్తి శివంగి మాంంగ్లా.. దోషి సహా లాయర్ అతుల్ కుమార్పై జాతీయ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తానిన తెలిపారు. వారి వేధింపులు, హెచ్చరికలకు భయపడకుండా.. తాను తీర్పు ఇస్తానని మరోసారి ప్రస్తావించారు. ఇలా కేసును ఏప్రిల్ 5కి వాయిదా వేశారు. ఇక చివరి రోజు రాగానే.. లాయర్ అతుల్ కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మీరు మహిళా న్యాయమూర్తితో ప్రవర్తించిన తీరుకు.. క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కూడా సూచించారు. అలాగే అతడిపై క్రిమినల్ ధిక్కార చర్యలను ఎందుకు ప్రారంభించకూడదో కూడా చెప్పాలని కోరారు.
అలాగే దోషికి 22 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.6.65లక్షల జరిమానా విధించారు. ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా దోషి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ తేదీ వరకు శిక్షను నెలపాటు సస్పెండ్ చేశారు. ఈక్రమంలోనే అతడికి రూ.30,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa