రాష్ట్రాల శాసన సభల్లో రెండు సార్లు పాస్ అయిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీం కోర్టు ఇటీవలే గడువు నిర్దేశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ పాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. అయితే తాజాగా వీటిపై కాబోయే సీజేఐ స్పందించారు. ఓ కేసు విచారణలో భాగంగా మాట్లాడుతూ.. ఇప్పటికే తమపై ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. మళ్లీ రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. అసలు ఏ కేసు విచారణలో భాగంగా జస్టిస్ గవాయ్ ఈ కామెంట్లు చేశారని తెలుసుకుంటున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి కుమార్ అలాగే ఉంచడం రాజ్యాంగ విరుద్ధం అని ఇటీవలే సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై తీర్పులో భాగంగానే ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆపాల్సి వస్తే.. అందుకు గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు కేవలం ఒక్క నెల మాత్రమేనని వివరించింది. అలాగే మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని ఆపాలనుకుంటే మూడు నెల్లలోగా అలంటి బిల్లును శాసన సభకు తిరిగి పంపించాలని సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయన చర్యలపై కోర్టులు న్యాయ సమీక్ష కూడా జరపొచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
ఇలా సుప్రీం కోర్టు సంచలన తీర్పునివ్వగా ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ స్పందించారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదని.. ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని సుప్రీం కోర్టు ప్రయోగించరాదని అన్నారు. శాసించే జడ్జులు ఉన్నారని, కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తిస్తారంటూ కామెంట్లు చేశారు. మరోవైపు సుప్రీం కోర్టు చట్టాలు చేస్తే గనుక పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈక్రమంలోనే కాబోయే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగానే జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కుంటున్నామని చెప్పారు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa