ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన కర్ణాటక మాజీ డీజీపీ కొడుకు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:39 PM

కర్ణాటక మాజీ పోలీస్ బాస్ ఒం ప్రకాష్ హత్యకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మాజీ డీజీపీ ఆయన భార్య పల్లవి చేతుల్లో హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దంపతులు తరచుగా గొడవపడేవారని, భర్తను చంపేస్తానని గతంలోనే పల్లవి బెదిరించినట్లు తెలిపారు. ఆమెకు స్క్రిజోఫోబియా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. భర్త కళ్లలో కారం కొట్టి.. ఆయనను కట్టేసి కత్తితో కసిదీరా పొడిచి చంపినట్టు ఘటనా స్థలిలో ఆధారాలను బట్టి పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఆయనకు కడుపు, ఛాతీ భాగంలో అనేక కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓం ప్రకాశ్ కుమారుడు కార్తికేశ్ తన తల్లి మానసిక స్థితి గురించి పోలీసులకు తెలియజేస్తూ.. తండ్రిని చంపేస్తానని గతంలోనే బెదిరించిందని తెలిపాడు.


ఈ బెదిరింపుల కారణంగా ఓం ప్రకాష్ తన అక్క ఇంటికి వెళ్లిపోగా... హత్య జరిగే రెండు రోజులు ముందు కూతురు కృతి ఆయనను తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. నాన్నకు రావడం ఇష్టంలేకపోయినా కృతి బలవంతంగా ఆయనను ఇంటికి తీసుకువచ్చినట్లు కార్తికేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హత్య జరిగిన సమయానికి తాను డొమ్‌లూర్‌లోని కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్ వద్ద ఉండగా... పక్కింటి వ్యక్తి ఫోన్ చేసి తన తండ్రి కింద అంతస్తులో పడి ఉన్నారని చెప్పారని వివరించాడు. ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చి, చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లానని, అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారని అన్నాడు.


ఘటనా స్థలిలో పగిలిన గాజు సీసా, కత్తి స్వాధీనం చేసుకున్నారు. భర్త కళ్లలో కారం కొట్టిన పల్లవి.. ఆయనను కట్టేసి, గాజు సీసాతో దాడి చేసి, తర్వాత కత్తితో పొడిచి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. హత్య అనంతరం పల్లవి మరో పోలీసు అధికారిణి భార్యకు విషయం చెప్పి.. ఆ రాక్షసుడ్ని చంపేశానని చెప్పినట్లు సమాచారం. ఆమే ఈ విషయం తన భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు తెలియజేశారు.


ఓ ఆస్తి విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసిందని భావిస్తున్నారు. కూతురు కృతి హత్యకు సహకరించారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్లవి, కృతి ఇద్దరూ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని కార్తికేశ్ తెలిపాడు. పోలీసులు ఆ ఇద్దరినీ 12 గంటలకుపైగా ప్రశ్నించినా, ఇంకా అరెస్ట్ చేయలేదు.


బిహార్‌కు చెందిన ఓం ప్రకాశ్.. జియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1981 ఐపీఎస్ క్యాడర్ అధికారి అయిన ఆయన.. బళ్లారి జిల్లా ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు. 2015 మార్చిలో కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిని స్వీకరించారు. అంతకు ముందు ఆయన ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హోం గార్డ్స్ చీఫ్‌గా సేవలు అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa