ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా చేరుకున్న జేడీవాన్స్ దంపతులు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:40 PM

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో సహా భారత పర్యటన కోసం వచ్చారు. సోమవారం రోజు ఉదయమే న్యూ ఢిల్లీ చేరుకున్న వీళ్లకు కేంద్రమంత్రి సహా ఇండియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన తన సతీమణి ఉషా చిలుకూరితో కలిసి జేడీ వాన్స్ విమానం దిగి కిందకు రాగా.. ఆ తర్వాత కాసేపటికి వారి పిల్లలు వచ్చారు. అయితే జేడీ వాన్స్ దంపతులు వెస్ట్రన్ దుస్తుల్లోనే దర్శనం ఇచ్చినప్పటికీ.. వారి పిల్లలు మాత్రం అచ్చమైన భారతీయ దుస్తుల్లో కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఆ పూర్తి వివరాలు మీకోసం.


సోమవారం రోజు ఉదయమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి న్యూ ఢిల్లీలో దిగారు. అయితే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా ఇతర అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలోనే అచ్చమైన తెలుగమ్మాయి అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి.. తనకు ఇండియాపై ఉన్న ప్రేమను కనబర్చారు. ముఖ్యంగా తన పిల్లలకు సంప్రదాయ బట్టలు వేసి ఇక్కడకు తీసుకు వచ్చారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఉషా చిలుకూరి.. భారత సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తారు. అమెరికాకు చెందిన జేడీ వాన్స్‌ను ఆమె పెళ్లాడినా.. తెలుగు సంప్రదాయం ప్రకారమే వారి వివాహం జరిగింది. ముఖ్యంగా వీరి పిల్లల పేర్లను కూడా అలాగే పెట్టారు.


జేడీ వాన్స్, ఉష చిలుకూరి దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు కాగా.. ఇందులో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. అయితే కుమారుల పేర్లు ఇవాన్, వివేక్ కాగా.. కుమార్తె పేరు మీరాబెల్. వీరి పేర్లకు తగ్గట్లుగానే ఈరోజు ఇండియా సంప్రదాయ దుస్తుల్లోనే వారిని ఇక్కడకు తీసుకు వచ్చారు. ముఖ్యంగా చిన్నారి మీరాబెల్‌కు అనార్కలీ డ్రెస్ వేయగా.. కుమారులు ఇద్దరికీ కుర్తా-పైజాబా తొడిగి తీసుకు వచ్చారు. దీంతో వీరిద్దరికీ సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉషా చిలుకూరికి భారతదేశంపై ఉన్న ప్రేమంతా వారి పిల్లల బట్టల్లోనే కనిపిస్తోందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.


మొత్తం నాలుగు రోజుల పర్యటన కోసం వీరు భారత్‌కు రాగా.. సోమవారం రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీని కలవబోతున్నారు. నేరుగా ప్రధానియే వీరికి లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో స్వాగతం పలకబోతున్నారు. ఆ తర్వాతే ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. అనంతరం విందు చేసి జయపురకు వెళ్తారు. అక్కడి నుంచి రాజస్థాన్, ఆగ్రా చూడబోతున్నారు. ఇందులో అంబర్ కోట, తాజ్ మహల్, శిల్పాగ్రామ్ వంటివన్నీ సందర్శించబోతున్నారు. 24వ తేదీన తిరిగి అమెరికాకు వెళ్లిపోతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa