ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా అమరావతిలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక ప్రధాని సభలో రాజధాని ప్రాంత రైతులు, మహిళలకు గొప్ప అవకాశం కల్పించనున్నారు.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేసిన అసమాన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని.. 3 ఏళ్లకు పైగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో 2014లో అమరావతి ప్రారంభోత్సవానికి పునాది రాయి వేసిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మరోసారి అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.
ఈ క్రమంలోనే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మే 2వ తేదీన ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్ రానున్నారు. అమరావతి రాజధాని, సీఆర్డీఏ పరిధిలో సుమారు రూ.లక్ష కోట్లతో చేపట్టే పనులకు నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. అదే సమయంలో భారీ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే సభస్థలి వద్ద మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో అమరావతి ప్రాంత రైతులు, మహిళలకు గొప్ప అవకాశం కల్పించనున్నారు. 3 వేదికల్లో ఒకదానిపై 30 మంది అమరావతి రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులను కూర్చునేందుకు అవకాశం కల్పించనున్నారు.
5 లక్షల మంది రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఏపీ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రధాని మోదీ.. హెలిప్యాడ్ దిగిన తర్వాత అక్కడి నుంచి సభాస్థలానికి చేరుకునే వరకు 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను గుంటూరు పోలీస్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, సీఆర్డీఏ, పోలీస్ అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. వాహనాలు, జనం రద్దీని నియంత్రించడం.. పార్కింగ్ సమస్యలను పరిష్కరించడంపై అధికారులకు నారాయణ సూచనలు చేశారు. మే 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభాప్రాంగణం వద్దకు వస్తారని తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు వెంటనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పూర్తై పనులు కూడా ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా మళ్లీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. మొత్తం రాజధాని అమరావతిలో రూ.లక్ష కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa