పహల్గామ్లోని బైసరన్ లోయలో మంగళవారం (ఏప్రిల్ 22న) జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో పలువురు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అసోంకి చెందిన ఓ ప్రొఫెసర్.. ఖురాన్లోని కల్మా ఏంటో తెలియకపోయినా.. దానిని చదువుతున్నవారితో శ్రుతి కలిపి దాడి నుంచి తప్పించుకున్నారు. అలాగే, ఘటన స్థలానికి వెళ్లడం ఆలస్యం కావడంతో కేరళకు చెందిన ఓ కుటుంబం దాడి నుంచి తప్పించుకోగలిగింది.. తాము ఆర్డర్ చేసిన ఆహారం ఉప్పు ఎక్కువకావడంతో లంచ్కు మళ్లీ ఆర్డర్ చేసింది. అదే వారి ప్రాణాలు కాపాడింది. కేరళకు చెందిన అల్బీ జార్జ్, ఆయన భార్య లావణ్య, వారి పిల్లలు, లావణ్య తల్లిదండ్రులు, మేనమామలు, మేనకోడళ్లు, వారి పిల్లలు కలసి ఏప్రిల్ 18న కొచ్చి నుంచి కశ్మీర్ పర్యటనకు బయలుదేరారు.
ఏప్రిల్ 19న శ్రీనగర్కి చేరుకుని, రెండు రోజుల పాటు గుల్మర్గ్, సోన్మార్గ్ను సందర్శించారు. ‘మంగళవారం నాడు మేము శ్రీనగర్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ వైపు బయలుదేరాం’ అని లావణ్య గుర్తుచేసుకున్నారు. ‘ఆ రోజు కొంచెం ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టాం. గత రెండు రోజులు వేళాపాళా లేకుండా తిరగడంతో సరిగ్గా భోజనం చేయలేదు.. కానీ, బైసరన్కు వెళ్లే ముందు ఖచ్చితంగా తినాల్సిందేనని నా భర్త పట్టుబట్టారు.... బైసరన్ అక్కడి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉంది’ అని ఆమె చెప్పారు.
రోడ్డుపక్కన ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద ఆగి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాం.. అందులో ఉప్పు ఎక్కువ కావడంతో తినడానికి ఇబ్బందిపడ్డారు.. రెస్టారెంట్ సిబ్బంది మళ్లీ తయారు చేస్తామని చెప్పారు... అలా వారు మళ్లీ ఆర్డర్ చేయడంతో దాదాపు గంటసేపు అక్కడే ఉండిపోయారు.. తరువాత భోజనం ముగించుకుని ప్రయాణం కొనసాగించిన ఆ కుటుంబం బైసరన్ లోయకు కేవలం రెండు కిలోమీటర్లు దూరంలో ఉండగానే ఏదో జరిగినట్టు అనిపించింది. ‘గుర్రాలు భయంతో వెనక్కి పరుగులు తీయడం, టాక్సీలు వేగంగా దిగివస్తుండటం చూశాం. పర్యాటకులు అరుస్తున్నారు కానీ వారి భాష అర్థం కాలేదు’ అని లావణ్య పేర్కొన్నారు.
పహల్గావ్లో టూరిస్ట్ల కోసం ఉగ్రవాదులతో హార్స్ రైడర్ వీరోచిత పోరాటం
అటుగా వస్తోన్న ఒక కారును ఆపి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. డ్రైవర్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు, పర్యాటకుల మధ్య జరిగిన సమస్యగా కనిపించిందని చెప్పారు. ‘ఇలాంటి సంఘటనలు త్వరగా పరిష్కారమైపోతాయని, ముందుకు వెళ్లమని అతడు చెప్పాడు. కానీ తీవ్రతను గ్రహించి ఆ ఫ్యామిలీ తిరిగి వెనక్కి వచ్చేసింది.
వెనక్కి వచ్చిన వారు ఓ సరస్సు దగ్గర కొంతసేపు గడిపారు. సుమారు సాయంత్రం 4:30 సమయంలో వ్యాపారులు దుకాణాలు మూసివేస్తూ ఏరియాలో ఉద్రిక్తత పెరుగుతున్నందున అక్కడ ఉండొద్దని సూచించారు. దాంతో వారు తమ రిసార్ట్కి వెళ్లిపోయారు. అంతలోనే బంధువుల నుంచి వచ్చిన కాల్స్ విన్నాక అసలు విషయం తెలిసింది. అది ఓ భారీ ఉగ్రదాడి అని. ‘అంత వరకూ మేము అది చిన్న గొడవ అనుకున్నాం.. ఆ రాత్రి నిద్రపట్టలేదు’ అని లావణ్య అన్నారు. ‘మా ప్రాణాలు కాపాడేందుకు ఆ దేవుడే ఇలా జరిపించినట్టు ఉంది’ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa