ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం దాడితో అరేబియా సముద్రంలో అలజడి

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 08:39 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో అరేబియా సముద్రంలో అలజడి మొదలైంది. ముఖ్యంగా ఈ సముద్రం నుంచే ఉపరితలం పైనుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామంటూ పాకిస్థాన్ మిలటరీ నోటమ్ విడుదల చేసింది. 24, 25వ తేదీల్లోనే వాటిని చేపడతామనగా.. వారికంటే ముందుగానే భారత్ అదే ప్రాంతంలో సీస్కిమ్మింగ్ పరీక్షను విజయవంతంగా చేపట్టింది. గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు భారత నౌకాదలం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో 28 మంది అమాయక పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన వ్యక్తి సహా అక్కడి ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయి. కానీ పాకిస్థాన్ మాత్రం తమకు ఈ దాడితో ఏ సంబంధం లేదని చెప్పింది. కానీ ఆ మాటలు నమ్మని భారత్.. పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో ఇప్పటికే ఆ దేశం విలవిల్లాడుతుండగా.. తాజాగా మరోసారి పాక్‌ను భారత్ గట్టి దెబ్బ కొట్టింది.


ముఖ్యంగా ఉపరితలం పైనుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామంటూ పాకిస్థాన్ మిలటరీ నోటమ్ విడుదల చేసింది. నోటమ్ అనగా నోటీస్ టు ఎయిర్‌మన్. అయితే ఈ పరీక్షలను 24, 25వ తేదీల్లో చేపడతామని పేర్కొంది. కానీ భారత్ వారికంటే ముందుగానే.. పాకిస్థాన్ అనుకున్న ప్రాంతంలోనే ఓ క్షిపణిని గగనతలంలోకి విజయవంతంగా పంపించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి ఆకాశంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. సీస్కిమ్మిగ్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.


సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతిత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీస్కిమ్మింగ్ టార్గెట్లుగా పిలుస్తుంటారు. ఐఎన్ఎస్ సూరత్, వివిధ రకాల మిలటరీ ఫ్లాట్‌ఫామ్‌లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది. ముఖ్యంగా టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్‌ను వినియోగించింది.


ఇజ్రాయెల్‌తో సంయుక్తంగా భారత్ ఈ క్షిపణిని అభివృద్ధి చేయగా.. 70 కిలో మీటర్ల ఇంటర్ సెప్షన్ పరిధిని కల్గి ఉంది. ఈ క్షిపణిని 2025 జనవరి నెలలో తయారు చేయడం ప్రారంభించగా.. ఇందుకోసం 75 శాతం స్వదేశీ విడి భాగాలను వాడారు. అలాగే ఈ క్షిపణి ఇంటిగ్రేషన్, బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, అధునాతన రాడార్ వ్యవస్థలను కలిగి ఉంది. ఇలా తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ భారత్ అద్భుతమైన మైలురాయిని సాధించడంతో దేశ ప్రజలంతా ఇండియన్ నేవీకి సెల్యూట్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa