జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సమర్థించలేమని ఇరు దేశాధినేతలు ఈ సంభాషణలో స్పష్టం చేశారు.ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడాలన్న తమ ఉమ్మడి సంకల్పాన్ని ఇరు నేతలు పునరుద్ఘాటించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. "ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు, బాధితులకు సంతాపం తెలిపారు" అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ 'X' వేదికగా పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్థన ఉండదని, మానవత్వంలో విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి నిలబడాలని నేతలు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.పహల్గామ్ దాడి పట్ల దేశ ప్రజల తీవ్ర విచారం, ఆగ్రహాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ హింసకు బాధ్యులైన వారిపై, వారికి మద్దతిస్తున్న వారిపై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఇరాన్లోని బందర్ అబ్బాస్లో శనివారం జరిగిన పేలుడులో ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇరు నేతల అభిప్రాయాలను ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా బలపరిచింది. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారం, సంఘీభావం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల కోసం ఉగ్రవాద మూలాలను నిర్మూలించాల్సిన అవసరాన్ని ఇరాన్ అధ్యక్షుడు నొక్కిచెప్పారని తెలిపింది. సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించేందుకు వీలుగా, వీలైనంత త్వరగా టెహ్రాన్ను సందర్శించాలని ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు రాయబార కార్యాలయం తన 'X' పోస్టులో వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa