ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింలు, కశ్మీరీలకు వ్యతిరేకంగా వెళ్లొద్దు: మరణించిన నేవీ ఆఫీసర్ భార్య

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 09:46 PM

ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన ఆరు రోజులకే ఆయన చనిపోగా.. మృతి చెందిన 10 రోజులకే ఆయన పుట్టిన రోజు ఉంది. ఈక్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు అంతా ఈరోజు అతడికి నివాళులు అర్పించారు. ఈసందర్భంగానే ఆయన భార్య హిమాన్షి నర్వాల్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ముస్లింలు, కశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. తాము శాంతి మాత్రమే కోరుకుంటున్నామంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండు సంవత్సరాల క్రితమే నౌకా దళంలో చేరి.. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహించారు. అయితే ఏప్రిల్ 16వ తేదీనే హిమాన్షితో ఈయనకు వివాహం కాగా.. 19వ తేదీన విందు నిర్వహించారు. ఆ తర్వాత భార్యతో కలిసి హాయిగా గడపాలని భావించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్.. భార్యను తీసుకుని జమ్ము కశ్మీర్ వచ్చారు. ఈక్రమంలోనే ఏప్రిల్ 22వ తేదీన అనుకోకుండా ఉగ్రదాడి జరగ్గా.. ఈ ఘటనలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన శవం పక్కనే కూర్చుని హిమాన్షి నర్వాల్ కన్నీళ్లు పెట్టగా.. దేశ ప్రజలంతా ఈ దృశ్యం చూసి కంటతడి పెట్టారు.


పెళ్లైన ఆరు రోజులకే భర్త చనిపోగా.. కన్నీటితో వీడ్కోలు చెప్పారు. సెల్యూట్ చేసి మరీ భర్త అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే ఆయన చనిపోయిన నేటితో 10 రోజులు అవుతుండగా.. ఈరోజే ఆయన పుట్టిన రోజు కావడం గమనార్హం. 2025 మే 1తో వినయ్ నర్వాల్‌కు 27 ఏళ్లు పూర్తి అవుతుండగా.. ఇటీవలే ఆయన చనిపోవడంతో కుటుంబ సభ్యులు అంతా అతడికి నివాళులు అర్పించారు. గురువారం రోజు కర్నాల్‌లో ఓ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంద పాల్గొని రక్తదానం చేశారు.


ముఖ్యంగా ఆఫీసర్ వినయ్ నర్వాల్ కుటుంబ సభ్యులు సహా.. అతడి భార్య హిమాన్షి కూడా అక్కడకు వచ్చారు. తన భర్తను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిపై కోపాన్ని ముస్లింలు, కశ్మీరీలపై చూపిస్తూ.. వారికి వ్యతిరేకంగా వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. తాము శాంతి కోరుకుంటున్నామని.. శాంతి మాత్రమే కోరుకుంటున్నామని నొక్కి చెప్పారు. అలాగే తన భర్త ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, శాంతితో ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ముఖ్యంగా తన భర్త ఫొటో వద్ద పుష్పగుచ్ఛాలు పెడుతూ.. తన అత్తగారిని పట్టుకుని ఏడ్చారు. ఆపై తన భర్త ఫొటోను చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు. బాధ్యులను భారత ప్రభుత్వం శిక్షించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa