పహల్గామ్ ఉగ్రదాడి జరిగి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన వ్యూహం కొరవడిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించినట్లు ఖర్గే తెలిపారు.కులగణనపై తమ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించడంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై నిజాయతీగా పోరాడితే, మొండి ప్రభుత్వమైనా తలవంచక తప్పదని రాహుల్ గాంధీ నిరూపించారని పేర్కొన్నారు. అయితే, కులగణన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించినప్పటికీ, దానిని ప్రకటించిన సమయం మాత్రం ఆశ్చర్యానికి గురిచేసిందని ఖర్గే వ్యాఖ్యానించారు. తమ పార్టీ డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గిందని, అయితే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిస్థితులు, భద్రతా వైఫల్యాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించే ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలన్నీ మద్దతుగా నిలుస్తాయని మరోసారి స్పష్టం చేశారు.ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, మృతులకు అమరవీరుల హోదా కల్పించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవాలని సీడబ్ల్యూసీ అభిప్రాయపడినట్లు ఖర్గే వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa