ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన అనుమానితులు శ్రీలంక చేరుకున్నారన్న సమాచారంతో కొలంబో విమానాశ్రయంలో కలకలం

international |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 08:24 PM

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన అనుమానితులు శ్రీలంక చేరుకున్నారన్న సమాచారంతో కొలంబో విమానాశ్రయంలో కలకలం రేగింది. భారత నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో శ్రీలంక భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.చెన్నై నుంచి కొలంబో చేరుకున్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్122 విమానంలో ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నట్లు భారత అధికారులు శ్రీలంకను హెచ్చరించారు. ఆ విమానం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 11:59 గంటలకు కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. వెంటనే శ్రీలంక పోలీసులు, శ్రీలంక వైమానిక దళం, విమానాశ్రయ భద్రతా సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి తమకు హెచ్చరిక అందిందని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. విమానంలోని ప్రయాణికులు, వారి లగేజీతో పాటు విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. గంటల తరబడి జరిపిన విస్తృత తనిఖీల్లో ఎటువంటి అనుమానితులు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభ్యం కాలేదని స్పష్టం చేశారు. దీంతో విమానానికి తదుపరి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.పహల్గామ్ ప్రాంతంలోని బైసరన్ లోయ వద్ద ఏప్రిల్ 22న పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సహకరించిన కొందరిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అనుమానితులు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో భారత అధికారులు పొరుగు దేశాలను అప్రమత్తం చేశారు. అందులో భాగంగానే కొలంబో విమానాశ్రయంలో తనిఖీలు జరిగాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa