పాకిస్తాన్ త్వరలోనే ముక్కలు కాబోతుందా. ఒకవైపు బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం బలోచ్ లిబరేషన్ ఆర్మీ.. పాక్ ప్రభుత్వం, సైన్యంతో భీకర దాడులకు దిగుతోంది. మరోవైపు.. భారత్ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పీఓకేలోని ప్రజలు కూడా తాము భారత్లోనే కలుస్తామని ఎప్పటినుంచో డిమాండ్లు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఏ క్షణమైనా పాక్పై దాడి చేస్తుందని ఆ దేశంతోపాటు ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇక గత కొన్ని నెలలుగా పాక్పై అవిశ్రాంత పోరాటం సాగిస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ.. తాజాగా తమ దాడులను ముమ్మరం చేసింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పలు పట్టణాలను వశం చేసుకునేలా ఈసారి పక్కా ప్లాన్తో దాడులు చేస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. ఇప్పటివరకు బలూచిస్తాన్ ప్రావిన్స్లో మోహరించిన ఆర్మీని ఎల్ఓసీ, భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో అక్కడ సైన్యం తగ్గిపోవడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ.. ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాల్లో మాత్రమే పాక్ ప్రభుత్వం అధికారం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో బీఎల్ఏ ఫైటర్స్ అధికారాన్ని చెలాయిస్తున్నారు. దీంతో క్వెట్టా, గ్వాదర్ పట్టణాలను కూడా పాక్ చేతుల నుంచి లాక్కునేందుకు బీఎల్ఏ దాడులు ప్రారంభించింది.
ఈ క్రమంలోనే తాజాగా చేస్తున్న దాడుల ప్రకారం.. కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ ఫైటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగోచార్ పట్టణంలోని అనేక ప్రభుత్వ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని సమాచారం. అందులో ఒక భవనానికి నిప్పుపెట్టినట్లు.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వైరల్ అవుతున్న వీడియోలో బీఎల్ఏ ఫైటర్స్ పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కనిపిస్తోంది.
మరోవైపు.. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాను.. కరాచీని కలిపే హైవేని బీఎలఏ ఫైటర్స్ దిగ్బంధించారు. నేషనల్ బ్యాంకులు, కోర్టులను తమ ఆధీనంలోకి తీసుకుని నిప్పంటించారు. విషయం తెలుసుకుని అక్కడికి పాకిస్తాన్ సైన్యం వచ్చే సరికి ఆ ప్రాంతం మొత్తం విధ్వంసం సృష్టించారు. అంతే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్పైనా బీఎల్ఏ ఫైటర్స్ దాడి చేసి.. పాక్ సైన్యానికి చెందిన ఆయుధాలను ఎత్తుకెళ్లిపోయారు. మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ సూసైడ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. కోట్ లాంగోవ్ ప్రాంతంలోని లెవీస్ చెక్పోస్టుపై కాల్పులు జరపగా అక్కడ ఒక అధికారి మరణించాడు. కలాత్ జిల్లాలోని రహీమాబాద్ ప్రాంతంలో ఒక వంతెనను బాంబుతో పేల్చి వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa