పర్వతాల్లో కోట్లాది రూపాయల విలువ గల నిధి నిక్షేపాలు బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెక్ రిపబ్లిక్ దేశంలోని పోడ్కర్కోనోసి పర్వతాల అందాలను ఆస్వాదించేందుకు ఇద్దరు పర్యాటకులు హైకింగ్కు వెళ్లారు. ఇక వారిద్దరూ ఊహించని రీతిలో కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు, నాణేలు దొరికాయి. అయితే ఈ సంఘటన ఫిబ్రవరిలో జరగ్గా.. ఆ వివరాలు తాజాగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. ఈ ఇద్దరు పర్యాటకులు పర్వత ప్రాంతంలో వెళ్తుండగా.. దాదాపు 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించాయి. ప్రస్తుతం వాటన్నింటినీ ఈస్ట్ బొహెమియన్ మ్యూజియంలో భద్రపరిచినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
అయితే ఆ నిధిలో దొరికిన నాణేలు 1808 కాలం నాటివి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్య కాలం నాటి ఈ బంగారు నాణేలను 1921 తర్వాత ఎవరైనా దాచిపెట్టి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపు 100 ఏళ్ల క్రితమే సంచుల్లో పెట్టి వాటిని భూమిలో దాచిపెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఇక వీటిని ఈస్ట్ బొహెమియన్ మ్యూజియంకు తరలించిన తర్వాత.. వాటి ధర ఎంత ఉంటుంది అనేది ఒక అంచనాకు వచ్చినట్లు ఒక అధికారి తెలిపారు. ఈ నిధి విలువైన లోహాల ప్రకారం సుమారు 3.40 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ. 2.87 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే వాటికి ఉన్న చారిత్రక నేపథ్యం ఆధారంగా వాటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
అయితే ఆ భారీ నిధిని ఎవరు దాచిపెట్టారు ఎందుకు దాచిపెట్టారు అనే దానిపై రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ఈ నిధిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు దాచిపెట్టారని అనుమానిస్తుండగా.. మరికొందరు మాత్రం విధి లేని పరిస్థితుల్లో ఆ నిధిని అక్కడ దాచిపెట్టి.. ఆ తర్వాత తిరిగి తీసుకుందామని భావించి ఉంటారని కానీ అది వీలు పడకపోవడంతో అక్కడే ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. చెక్ రిపబ్లిక్ దేశ చట్టాల ప్రకారం.. ఎవరైనా పర్యాటకులు నిధిని కనుగొంటే.. దాని పూర్తి విలువలో 10 శాతం వారికి అందిస్తారు. ప్రస్తుతం ఆ నిధికి సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించే పనిలో మ్యూజియం అధికారులు పడ్డారు. ఏది ఏమైనా సరదా కోసం పర్వతాల్లోకి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులు.. నక్క తోక తొక్కినట్లు అయిందని.. ఈ వార్త విన్న వారు అనుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa