ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన్ను అందుకే జైల్లో కలిశా: ఉండవల్లి అరుణ్ కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 08:31 PM

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన, ఉగ్రవాదం, ఇటీవల పరిణామాల గురించి మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కక్ష సాధింపు చర్యలు వద్దని చెప్పానని గుర్తు చేశారు. అలాగే ఏపీ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒక ఆశాజ్యోతి అన్నారు. జగన్ తప్పు చేస్తే జగన్‌ని జైలులో పెట్టాలి.. కానీ ఆ ప్రభుత్వ హయాంలో పనిచేసిన పోలీసులను జైల్లో పెట్టకూడదు అన్నారు. చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు తనకు స్నేహితులుగా ఉన్నారని.. వారిలో మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు వారిలో ఒకరని.. అందుకే తాను జైలుకు వెళ్లి ఆంజనేయుల్ని కలిశానన్నారు.


డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు అరుణ్‌కుమార్. ముంబై నటి ఫిర్యాదుపై ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో విచారణ ఎలా ప్రారంభిస్తారన్నారు ఉండవల్లి. పీఎస్ఆర్ అరెస్ట్ పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందని.. తాను మరి కొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తనతో చెప్పారన్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబైలో పూర్తి సమాచారాన్ని సేకరించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు.


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ పునర్విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 11 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. ఈ పిటీషన్‌లో మార్పు చేసి ఏపీ పునర్విభజన తప్పు అని నిర్థారించాలని మళ్లీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసినట్లు తెలిపారు. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్‌లో బిల్లు పాస్ కాకుండానే ఆంధ్రప్రదేశ్ విభజన చేశారని ఆరోపించారు. కేంద్రం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని.. ఏపీ ప్రభుత్వం ఒక సీనియర్ న్యాయవాదిని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో కేసును పర్యవేక్షించాలని కోరారు. ఈ కేసుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ఆశాజ్యోతి అన్నారు. పవన్ కల్యాణ్‌కు ఈ విషయంపై లేఖ రాశానని గుర్తు చేశారు.


కేంద్రం ఉగ్రవాదం విషయంలో తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని కోరారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. భారతదేశంతో యుద్ధం చేసే శక్తి పాకిస్థాన్‌కు లేదని.. యుద్ధం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందన్నారు. భారతదేశంలో మతం ప్రధానమనేది సరికాదని..ఇండియాలో 12 శాతం ముస్లింలు ఉన్నారన్నారు. అటు పాకిస్థాన్‌లో హిందువులు ఒక్క శాతం మాత్రమే ఉన్నారన్నారు. ముస్లింలపై వ్యతిరేకత సరికాదని..కానీ పాకిస్థాన్‌ను మాత్రం వ్యతిరేకించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదని.. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa