ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూ కాశ్మీర్‌పై మరో ఉగ్రదాడి.. ఈసారి జైళ్లను టార్గెట్ చేయనున్న ఉగ్రవాదులు

national |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 10:21 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలోని కీలక ప్రాంతాలకు హై అలర్ట్ విధించారు. భారీగా బందోబస్తును మోహరించి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. ఇక జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు అనుక్షణం గస్తీ కాస్తున్నారు. ఈ ఒక్క ఉగ్రదాడి కారణంగా.. దేశవ్యాప్తంగా తీవ్ర అప్రమత్త చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు.. మరోసారి జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా భీకర దాడికి తెగబడే అవకాశాలు ఉన్నట్లు భారత నిఘా వర్గాలకు ఉప్పందింది. దీంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న జైళ్లే లక్ష్యంగా ఈసారి ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


ఉగ్రవాద సంస్థలకు చెందిన హై ప్రొఫైల్‌ నాయకులు జమ్మూ కాశ్మీర్‌ జైళ్లలో ప్రస్తుతం ఖైదీలుగా ఉన్నారు. అయితే వారిని విడిపించడం కోసం ఉగ్రవాదులు భారీ కుట్రకు తెరలేపినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలకు దిగాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్‌, కోట్‌ బాల్వాల్‌ జైల్‌.. జమ్మూలోని జైళ్లకు భారీగా బలగాలను మోహరించి పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్‌ సెల్స్‌, ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లను అదుపులోకి తీసుకుని ఈ జైళ్లలో నిర్బంధించారు.


మరోవైపు.. ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన వారు మాత్రమే కాకుండా గతంలో ఆర్మీ వాహనంపై దాడి చేసిన కేసులో నిందితులుగా ఉన్న నిస్సార్‌, ముష్తాక్‌ సహచరులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న జైళ్లపై దాడి జరగొచ్చనే కీలక సమాచారం నిఘా వర్గాలకు అందింది. దీంతో ఆయా జైళ్ల వద్ద భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో సీఐఎస్ఎఫ్ డీజీ ఇదే విషయంపై భేటీ అయి చర్చించినట్లు తెలుస్తోంది. 2023 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో జైళ్ల భద్రతను మొత్తం సీఐఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి.


ఇదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. జమ్మూ కాశ్మీర్‌లో పోలీసులు, భద్రతా బలగాలు.. భారీ ఆపరేషన్లు చేపడుతున్నారు. ఉగ్రవాద మూలాలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పూంచ్‌ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు ఒక ఉగ్రస్థావరాన్ని గుర్తించాయి. ఆ ఉగ్రస్థావరంలో కమ్యూనికేషన్‌ పరికరాలు, ఐదు ఐఈడీలు దొరకడం సంచలనం రేపుతోంది. ఇక ఇది సురాన్‌ కోట్‌ ప్రాంతానికి అతి సమీపంలోనే ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa