భారతదేశానికి పాకిస్థాన్తో ఉద్రిక్తతలు పెంచుకోవాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని, అయితే పాకిస్థాన్ ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, వాటిని తిప్పికొట్టేందుకు, ధీటుగా ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతర పరిణామాలపై ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ సహా పలు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ ప్రత్యేకంగా మాట్లాడారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు జరిపిన కచ్చితత్వంతో కూడిన దాడుల గురించి, ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి వారికి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగానే, భారత వైఖరిని ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలియజేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ఎంతటి చర్యలకైనా వెనుకాడబోమని పరోక్షంగా హెచ్చరించారు."ఉద్రిక్తతలను పెంచాలన్నది మా ఉద్దేశం కాదు. అయితే, పాకిస్థాన్ గనుక ఏదైనా సాహసానికి ఒడిగడితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దానికి తగిన విధంగా, దృఢంగా ప్రతిస్పందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని దోవల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనే లక్ష్యంగా, ఆ దేశంలోని సాధారణ పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా ఈ దాడులను అత్యంత కచ్చితత్వంతో, వ్యూహాత్మకంగా నిర్వహించామని కూడా ఆయన అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa