ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదం అంతానికి ఇదే ఆరంభం..:హిమాన్షి నర్వాల్

national |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 07:40 PM

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం రోజు అర్థరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట మెరుపు దాడులు చేసింది. అయితే తాజాగా ఈ ఘనటపై పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ పేరు సరిగ్గా సరిపోయిందని.. తనకు ఈ చర్యతో కాస్త ఊరట లభించిందని చెప్పుకొచ్చారు. అలాగే ఉగ్రవాదం అంతానికి ఇదే ఆరంభం అని వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ అమరవీరుల హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. అయితే పెళ్లైన నాలుగు రోజులకే భార్యను తీసుకుని హనీమూన్ కోసం జమ్ము కశ్మీర్ వెళ్లగా.. దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగింది. అనుకోకుండా ఆయన ప్రాణాలు కోల్పోయారు. భార్య కళ్లెదుటే ముష్కరులు అతడిని కాల్చి చంపగా.. ఆయన సతీమణి హిమాన్షి నర్వాల్ భర్త మృతదేహం పక్కనే కూర్చుని కన్నీళ్లు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వెరల్ కాగా.. దేశం మొత్తం కంటతడి పెట్టింది. అయితే ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం రోజు అర్ధరాత్రి భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది.


తాజాగా దీనిపై లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సతీమణి హిమాన్షి నర్వాల్ స్పందించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి దేశానికి శాంతి చేకూర్చాలనే లక్ష్యంతోనే తన భర్త రక్షణ దళంలో చేరారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన లేకపోయినా.. ఆ స్ఫూర్తి మాత్రం ఉందని అన్నారు. అమాయక పర్యటకుల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలను రోడ్డుకు ఈడ్చిన వారికి.. సర్కారు వేసిన శిక్ష చేసి తన భర్త ఆత్మ శాంతించి ఉంటుందన్నారు. అలాగే ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పారు. తన లాంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదని.. ఈ ప్రతీకార చర్యకు ఆపరేషన్ సిందూర్ పేరు సరిగ్గా సరిపోయిందన్నారు.


తనకు ఇటీవలే పెళ్లి అయిందని చెప్పిన హిమాన్షి నర్వాల్.. తన జీవితాన్ని ఉగ్రవాదులు లాగేసుకున్నారని గుర్తు చేశారు. కళ్లముందే తన జీవితం తల్లకిందులైందని.. తనతో పాటు మరెంతో మంది జీవితాలు నాశనం అయ్యాయని చెప్పారు. పురుషులు కూడా తండ్రులు, సోదరులను కోల్పోయారన్నారు. తన భర్త మృతితో తానెంత బాధను అనుభవిస్తున్నానో చెప్పలేకపోతున్నానని కన్నీటిపర్యంతం అయ్యారు. భారత్ చేసిన ప్రతీకార చర్యతో కాస్త ఊరట లభించిందని.. ఉగ్రవాదం అంతానికి ఇదే ఆరంభం అని చెప్పారు. అంతేకాకుండా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు అమరవీరుల హోదా ఇవ్వాలని హిమాన్షి నర్వాల్ ప్రభుత్వాన్ని కోరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa