ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పని కూడా చేయాలి,,,ఆపరేషన్ సిందూర్‌పై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్..

national |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 07:57 PM

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలను కొనసాగిస్తోంది. మంగళవారం రోజు అర్ధరాత్రి ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఘటనలో మొత్తంగా 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుండగా.. దేశంలోని రాజకీయ నాయకులంతా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తూనే.. భారత దేశానికి అండగా నిలబడుతున్నారు. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్‌పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఈ దాడిని స్వాగతిస్తున్నానంటూనే మరికొన్ని కామెంట్లు చేశారు.


ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే.. ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయాలంటూ అన్ని పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా తోడుగా ఉంటామని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఒవైసీ సైతం.. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. బీజేపీ సర్కారు తీసుకుంటున్న ప్రతీ చర్యకు మద్దతు పలుకుతూనే వస్తున్నారు. సింధూ నదీ జలాల రద్దును సైతం స్వాగతించారు.


 అంతేకాకుండా భారత్ తీసుకున్న ఈ చర్యపై పాకిస్థాన్ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. గట్టిగా బదులిచ్చారు. ముఖ్యంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి.. పాకిస్థాన్‌లో ఉగ్రావాదులే లేరని, సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ వ్యాఖ్యానించగా.. ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో మాట్లాడే మాటలు వింటుంటే చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తుందని.. ఆయన తల్లిని, తాతను కూడా ఉగ్రవాదులే చంపారని గుర్తు చేశారు. ఇలా ఎప్పుడూ భారత సర్కారుకు మద్దతుగా నిలుస్తున్న ఒవైసీ.. ఆపరేషన్ సిందూర్‌ను కూడా స్వాగతించారు.


ఎక్స్ వేదికగా ఆపరేషన్ సిందూర్‌పై కూడా అసదుద్దీన్ ఒవైసీ ఓ పోస్టు పెట్టారు. పాకిస్థాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రక్షణ దళాలు దాడులు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అలా చేస్తేనే దాయాది దేశం మరోసారి ముందడుగు వేయదని వెల్లడించారు. ఇక్కడితోనే ఆగిపోకుండా పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూడా నాశనం చేయాలని సూచించారు. చివర్లో జై హింద్ అని రాశారు. ప్రస్తుతం అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa