ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. నంబర్లు ఇవే.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 07:19 PM

భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజల అవసరం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జమ్ము కాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలోని తెలుగువారు.. అలాగే ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి సహాయం కోసం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి సమాచారం, సహాయం కావాలన్నా సంప్రదించటం కోసం ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.


9871999430, 011-23387089, 98719 99053 కంట్రోల్ రూమ్ నంబర్లు అందుబాటులో ఉంచారు. అలాగే అదనపు సమాచారం కోసం డిప్యూటీ కమిషనర్‌ నంబర్‌ 98719 90081 లేదా లైజన్‌ ఆఫీసర్‌ నంబర్‌ 98183 95787ను సంప్రదించాలని అధికారులు సూచించారు. మరోవైపు ఇండియా పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఇండియా పాక్ ఉద్రిక్తతల వేళ.. దేశ రక్షణలో ఏపీకి చెందిన మురళి నాయక్ అనే జవాన్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని .. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మురళి నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియజేశారు.


మరోవైపు ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణపైనా, వీఐపీల భద్రతపైనా సమీక్షించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హాతో చర్చించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు.


మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్యూరిటీ విషయంలోనూ పటిష్ట చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. మరింత పటిష్టంగా భద్రతా చర్యలు ఉండాలని ఇంటలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ అధికారులను ఆదేశించారు. ఇక సెక్యురిటీ ప్రొటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారులకు స్పష్టం చేశారు. ప్రోటోకాల్స్ విషయంలో రాజీ వద్దని.. సీఎం జనంలోకి వెళ్లే సమయంలో చేయాల్సిన ప్రత్యేక ఏర్పాట్లు, పాటించాల్సిన నిబంధనలపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa