ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకున్నాయి. గురువారం రాత్రి పాకిస్థాన్.. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మీద దాడి చేసేందుకు యత్నించింది. అయితే భారత్ దాయాది దేశం కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
భారత్తో జరుగుతోన్న సంఘర్షణల్లో.. తమ ఎయిర్ఫోర్స్ రెండు జేఎఫ్ 17 యుద్ధ విమానాలను కోల్పోయినట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఒక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఇండియన్ ఆర్మీ నేలకూల్చిందని.. పైలట్ను బంధించిందని ప్రచారం జరుగుతోంది. దీంతో భారత్పై దాడి చేసేందుకు అమెరికా తయారీ ఎఫ్-16 యుద్ధ విమానాలను వాడేందుకు పాకిస్థాన్కు అనుమతి ఉందా? అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది.
ఎఫ్-16 వినియోగంలో పాక్ని కంట్రోల్ చేసేదేంటి?
పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. అయితే వాటి వినియోగం, మార్పుల విషయంలో అమెరికా కఠినమైన నిబంధనలు విధించింది. వాషింగ్టన్.. ఈ యుద్ధవిమానాలను యూఎస్ ఫారిన్ మిలిటరీ సేల్స్ (ఎఫ్ఎంఎస్) కార్యక్రమం కింద పాకిస్థాన్కు విక్రయించింది. ఎండ్-యూజ్ మానిటరింగ్ (ఈయూఎం) ప్రకారం.. అమెరికా అనుమతి లేకుండా పాకిస్తాన్ ఈ యుద్ధవిమానాలను స్వేచ్ఛగా ఉపయోగించకూడదు, మార్చకూడదు. అంతేకాకుండా గోల్డెన్ సెంట్రీ, లాంతర్న్ వంటి కార్యక్రమాలలో భాగంగా అమెరికా బృందాలు పాకిస్థాన్లో ఉన్నాయి. అమెరికన్ టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చూడటమే వాటి విధి. ఈ బృందాలు విమానాలు, ఆయుధాల మోహరింపును నిత్యం పర్యవేక్షిస్తుంటాయి.
అధికారిక నిబంధనలు ఏం చెబుతున్నాయి..
ఈ ఒప్పందాల ప్రకారం, పాకిస్థాన్.. అమెరికా అనుమతి లేకుండా.. ఆ దేశం అభివృద్ధి చేసిన ఎఫ్-16 యుద్ధవిమానాలు, ఏఐఎం-120 ఆమ్రాం (ఏఎంఆర్ఏఏఎం) క్షిపణులను సంప్రదాయ యుద్ధంలో ఉపయోగించేందుకు అనుమతి లేదు. అంతేకాక పాకిస్థాన్.. ఈ విమానాలను ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మాత్రమే ఉపయోగించాలి. ప్రత్యక్షంగా రెండు దేశాల మధ్య జరిగే పోరాటంలో వీటిని వినియోగించేందుకు పాక్కు అనుమతి లేదు. కాబట్టి, అమెరికా పత్రాలు ప్రత్యేకంగా భారతదేశం మీద వీటిని వినియోగించకూడదని స్పష్టంగా చెప్పకపోయినా సరే.. పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్లను యుద్ధం వంటి పరిస్థితుల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించకూడదు.
పాక్ నియమాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది..
పాకిస్తాన్ మళ్లీ ఎఫ్-16లను దుర్వినియోగం చేస్తే, అమెరికా దాయాది దేశానికి తన మద్దతును నిలిపివేయవచ్చు. లేదంటే మరో అడుగు ముందుకు వేసి.. పాక్తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవచ్చు. ఈ యుద్ధవిమానాల మెయింటెనెన్స్, విడిభాగాల కోసం పాకిస్థాన్ అమెరికాపై ఆధారపడుతుంది. కాబట్టి ఒకవేళ అమెరికా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే.. ఎఫ్-16 ఫైటర్ జెట్లను పాకిస్థాన్ ఉపయోగించడం కష్టం అవుతుంది. దీని ప్రభావం ఆ దేశ రక్షణ వ్యవస్థపై పడుతుంది.
2019లో ఏం జరిగిందంటే..
అయితే పాకిస్థాన్ అమెరికా అనుమతి లేకుండా 2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించింది. దీంతో పాకిస్థాన్ ఎఫ్-16 ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. దీనికి సంబంధించి 2019 డిసెంబర్లో లీకైన పత్రాలను ఉటంకిస్తూ.. మీడియాలో కథనాలు వచ్చాయి. వాటి ప్రకారం.. ఎఫ్-16 యుద్ద విమానాల అనధికారిక వినియోగంపై అమెరికా.. పాక్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని మీడియా కథనాలు చెప్పుకొచ్చాయి.
అంతేకాక ఆగస్టు 2019లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఏసీఎం ముజాహిద్ ఖాన్కు అమెరికా పంపిన మందలింపు లేఖన కూడా లీకైంది. ఎఫ్-16 యుద్ధ విమానాలను అనధికార స్థావరాలకు తరలించడం ద్వారా ఇస్లామాబాద్ "ఇరు దేశాల ఉమ్మడి భద్రతను ప్రమాదంలో పడేస్తోంది" అని అమెరికా తన లేఖలో.. పాక్ను ఘాటుగా మందలించిందని మీడియా తెలిపింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ యుద్ధవిమానాల దుర్వినియోగాన్ని అమెరికా ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థం అవుతుంది.
అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో పాక్.. భారతదేశం మీద ఎఫ్-16లను వాడితే.. అమెరికా ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటే.. పాకిస్థాన్ ఇబ్బందుల్లో పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్తాన్ వద్ద ఎన్ని ఎఫ్ 16లు ఉన్నాయంటే..
ప్రస్తుతం భారత్ వద్ద 680కిపైగా యుద్ధ విమానాలు ఉండగా.. పాకిస్థాన్ వద్ద 410కిపైగా ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇందులో 75కిపైగా ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే ఎఫ్-16 యుద్ధ విమానాలను అమెరికా నిబంధనలకు అనుగుణంగానే వాడాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa