ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోంగేవాలా యుద్ధం: 120 మంది భారత జవాన్లు.. వేలాది మంది పాక్ సైనికులతో చీకట్లో పోరాటం

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 08:25 PM

భారత్, పాకిస్థాన్ మధ్య ఇప్పటి దాకా జరిగిన ప్రతి యుద్ధంలోనూ మనదే పై చేయి. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ.. భౌగోళిక పరిస్థితులు శత్రువుకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. భారత సాయుధ దళాల పోరాటం ముందు శత్రు సేనలు తలొంచక తప్పలేదు. 1971 యుద్ధంలోనైతే కేవలం 120 మంది భారత సైనికులు.. 45 యుద్ధ ట్యాంకులతో ఉన్న వేలాది మంది పాకిస్థాన్ సైనికులతో ఓ రాత్రంతా పోరాడారు. తాము తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ.. చెప్పుకోదగ్గ ఆయుధాలు లేకపోయినప్పటికీ.. చీకట్లో శత్రువుకు చుక్కలు చూపించారు. తెల్లవారిన తర్వాత భారత వైమానిక దళం రంగ ప్రవేశంతో.. పాక్ చిత్తుగా ఓడిపోయింది.


బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం 1971డిసెంబర్లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేసిందనే సంగతి తెలిసిందే. తూర్పు పాకిస్తాన్‌లో (ప్రస్తుత బంగ్లాదేశ్) జరిగిన ఈ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధిస్తున్న సమయంలో.. పాకిస్తాన్ పశ్చిమ భాగం వైపు ఫోకస్ చేసింది. రాజస్థాన్‌లోని కొన్ని భూభాగాలను ఆక్రమించి భారత్‌పై ఒత్తిడి పెంచాలనుకుంది. ఇందులో భాగంగా జైసల్మేర్ సెక్టార్‌లో కీలకమైన లోంగేవాలా పోస్టును వశం చేసుకోవడానికి భారీ సైన్యాన్ని పంపింది. వ్యూహాత్మకంగా చాలా కీలకమైన లోంగేవాలాను గనుక పాకిస్తాన్ ఆక్రమిస్తే.. జైసల్మేర్ వైపు సులభంగా చొచ్చుకువచ్చే అవకాశం ఉండేది.


1971 డిసెంబర్ 4వ తేదీ రాత్రి మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి నాయకత్వంలో.. 23వ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన కేవలం 120 మంది సైనికులు లోంగేవాలా పోస్టులో డ్యూటీలో ఉన్నారు. అదే సమయంలో 2000 నుంచి 3000 మంది సైనికులు, 40కి పైగా ట్యాంకులతో కూడిన భారీ పాకిస్థాన్ దళం లోంగేవాలా వైపు దూసుకొచ్చింది. పాక్ దళాలు అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి ప్రారంభించాయి.


పాకిస్థాన్ దళాలతో పోలిస్తే.. భారత సైనికుల సంఖ్యాబలం, ఆయుధ సంపత్తి చాలా తక్కువ. వారి వద్ద కొన్ని మీడియం మెషిన్ గన్స్, మోర్టార్‌లు, ఒకే ఒక జీప్ మౌంటెడ్ రికాయిల్‌లెస్ గన్ మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ, మేజర్ చాంద్‌పురి తన సైనికుల్లో మనోధైర్యాన్ని నింపి పోరాటానికి సిద్ధం చేశారు. తమ దగ్గరున్న పరిమిత వనరులతోనే వారు శత్రువును ఎదుర్కొన్నారు. పాక్ ట్యాంకులు ముందుకు రాకుండా అడ్డుకోవడానికి ఇసుక దిబ్బలను, అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించారు. మేజర్ చాంద్‌పురి బంకర్ల మధ్య తిరుగుతూ సైనికులను నిరంతరం ప్రోత్సహించారు.


రాత్రి పూట అంతా చీకటిగా ఉండటంతో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ బరిలోకి దిగే పరిస్థితి లేకపోయింది. ఇది భారత సైనికులకు కలిసొచ్చింది. రాత్రంతా పోరాడుతూ శత్రువును నిలువరించగలిగారు. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ట్యాంకర్లను నాశనం చేశారు. తెల్లవారుజామున పరిస్థితిని గమనించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. జైసల్మేర్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన హంటర్, మారుత్ యుద్ధ విమానాలు పాకిస్థాన్ ట్యాంకులపై, సైనికులపై విరుచుకుపడ్డాయి.


పాకిస్థాన్ ట్యాంకులు ఎడారి ఇసుకలో కూరుకుపోయి ముందుకు కదల్లేకపోయాయి. ఇదే అదనుగా భారత వైమానిక దళం విరుచుకుపడింది. పాకిస్థాన్‌కు చెందిన అనేక ట్యాంకులు, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో వందలాది మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు.


భారత సైనికుల వీరోచితంగా ప్రతిఘటించడంతోపాటు.. సరైన సమయంలో ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో.. లోంగేవాలా పోస్టును ఆక్రమించాలన్న పాకిస్థాన్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. తక్కువ మంద సైనికులే ఉన్నప్పటికీ.. పట్టుదలతో, ఎంతో ధైర్యంగా భారత సైనికులు సాధించిన ఈ విజయం భారత సైనిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.


లోంగేవాలా యుద్ధం - కొన్ని ఆసక్తికరమైన అంశాలు:


లోంగేవాలాలో టిఫిన్ చేసి.. జైసల్మేర్‌లో భోజనం చేసి.. జోధ్‌పూర్‌లో రాత్రి భోజనం చేస్తామనే ధీమాతో పాకిస్థాన్ దళాలు ఈ యుద్ధాన్ని ప్రారంభించాయి. కానీ భారత సైనికులు వారి అంచనాలను తలకిందులు చేశారు. మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి అవసరమైతే యుద్ధ ఖైదీగా చిక్కకుండా తనను తాను కాల్చుకోవడానికి సిద్ధంగా ఒక లోడెడ్ కార్బైన్‌ను సిద్ధం చేసుకున్నారు.


లోంగేవాలా యుద్ధం బాలీవుడ్‌లో "బోర్డర్" సినిమాగా తెరకెక్కి విశేష ప్రజాదరణ పొందింది. భారత్ - పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో ఈ సినిమాను తెగ చూస్తున్నారు. యుద్ధం జరిగిన ప్రాంతాన్ని ఇప్పుడు లోంగేవాలా యుద్ధ స్మారక చిహ్నంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ ధ్వంసమైన పాకిస్థాన్ ట్యాంకులను.. యుద్ధ సామాగ్రిని చూడవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa