గత కొన్నిరోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. రెండు దేశాల మధ్య జరిగిన చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు శనివారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) శనివారం మధ్యాహ్నం భారత డీజీఎంఓకు ఫోన్ చేసినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఓకే చెప్పినట్లు తెలిపారు. ఈ చర్చల తర్వాత నేవీ, ఎయిర్ఫోర్స్, ఆర్మీ.. త్రివిధ దళాలు తమ దాడులను తక్షణమే నిలిపివేయాలని ఒక అవగాహనకు వచ్చినట్లు వెల్లడించారు.
శనివారం మధ్యాహ్నం 3:35 గంటలకు పాకిస్తాన్ డీజీఎంఓ.. భారత డీజీఎంఓకు ఫోన్ చేశారని విక్రమ్ మిస్లీ తెలిపారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి రెండు దేశాల మధ్య అన్ని రకాల కాల్పుల విరమణ పాటించాలని భారత్, పాకిస్తాన్ దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు. భూమి నుంచి.. గగనతలం నుంచి.. సముద్రం నుంచి చేసే అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు.
ఈ చర్చలకు అనుగుణంగా రెండు దేశాలు తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే రెండు దేశాలకు సంబంధించిన ఉన్నతాధికారులు.. మే 12వ తేదీ(సోమవారం) రోజున మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి మాట్లాడుకుంటారని విక్రమ్ మిస్రీ తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇతర అంశాలపై లేదా ఇతర వేదికలపై చర్చలు జరిపేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు.. భారత్తో కాల్పుల విరమణ అంగీకారానికి సంబంధించిన విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ధృవీకరించారు. భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa