భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ ప్రతీ ఒక్కరిలోనూ దేశభక్తి ఉరకలేస్తోంది. సామాన్య ప్రజలు సైతం దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం అంటున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన జవాన్లు సైతం.. అవసరమైతే ఒక్క మాట చెప్పండి భరతమాత కోసం మళ్లీ సరిహద్దుల్లోకి వచ్చేస్తామని వివరిస్తున్నారు. కేవలం వార్తల్లో చూస్తున్న వారిలోనే దేశభక్తి ఇంతలా పొంగిపోతుంటే.. ఇక కథన రంగంలో ఉన్న సైనికుల గుండెల్లో ఎంత గర్వం నిండి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ప్రాణాలు పోతున్నా జై హింద్, జై భారత్ మాత అనే జవాన్లు.. ఇంటి దగ్గర తన కుటుంబ పరిస్థితి ఏమవుతున్నా పట్టించుకోకుండా శుత్రుమూకల గుండెల్లో భయం పుట్టిస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే ఓ సైనికుడికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. తన తండ్రి చనిపోయాడని.. కడచూపు కోసం, కర్మకాండలు చేయడం కోసం ఇంటికి రావాలని పిలుపొచ్చింది. తండ్రి చనిపోయాడన్న వార్త గుండెల్ని పిండేస్తున్నా.. తాను దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉందని గుర్తించాడు. వెంటనే తాను రాలేనని.. కచ్చితంగా సరిహద్దుల్లో గస్తీ కాయాల్సిందేనని చెప్పాడు. అలాగే తండ్రికి వేరే వాళ్లతో కర్మకాండలు చేయించమని చెప్పి.. వీడియో కాల్ ద్వారానే కడచూపు చూసుకున్నాడు. కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆపై ఫోన్ కట్ చేసి నేరుగా కదన రంగంలోకి అడుగు పెట్టాడు.
రాజస్థాన్లోని జైపూర్ జిల్లా చక్సు ప్రాంతంలోని బంధాకీ ధాని గ్రామానికి చెందిన రాజారామ్ ధన్ఖడ్ ఆర్మీ జవాన్గా పని చేస్తున్నారు. అయితే పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. తన వంతు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రాజారామ్ ధన్ఖడ్ తండ్రి కులరామ్ ధన్ఖడ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు సరిహద్దుల్లో సేవలందిస్తున్న తమ కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తండ్రి మరణ వార్త వినగానే జవాన్ రాజారామ్ ధన్ఖడ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే రమ్మని చెప్పగా.. రాలేనని చెప్పారు.
ఎందుకని ప్రశ్నించగా.. తండ్రికి కర్మకాండలు చేసి కడచూపు చూడడం కంటే కూడా.. దేశం కోసం సేవే చేయాల్సిన బాధ్యతే తనపై ఎక్కువగా ఉందని వివరించారు. అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు సైతం అతడిని రావాలని బలవంతం చేయలేదు. లోపల బాధేమీ పెట్టుకోకుండా శత్రుమూకల గుండెల్లో భయం పుట్టించమని వివరించారు. కానీ చివరి సారిగా ఓసారి వీడియో కాల్ చేస్తామని.. అలా తన తండ్రి చూసుకోమని చెప్పారు. దీంతో సైనికుడు రాజారామ్ ధన్ఖడ్.. వీడియో కాల్ ద్వారానే తండ్రిని చివరి సారిగా చూసుకున్నారు. ఆపై ఫోన్ కట్ చేసి మళ్లీ విధుల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
కన్నతండ్రి మరణించినా కడచూపునకు రాకుండా.. దేశ సేవలోనే నిమగ్నమైన జవాన్ రాజారామ్ను చూసి గర్వపడుతున్నట్లు పలువురు కామెంట్లు పెడుతున్నారు. మీలాంటి ధీర సైనికులు ఎన్నో త్యాగాలు చేసి, సరిహద్దులో ఇలా గస్తీ కాయడం వల్లే మేమందరం ఇక్కడ సుఖంగా ఉండగల్గుతున్నామంటూ పేర్కొంటున్నారు. ఇలాంటి జవాన్ల త్యాగాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..?
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa