భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణ తర్వాత.. రేపు (మే 12) ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ అంశంపైనా, ఆపరేషన్ సిందూర్పైనా భారతదేశం తన వైఖరి స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ప్రపంచదేశాలు, పాకిస్థాన్ ఈ విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతదేశం, పాకిస్థాన్ మధ్య సాధారణ సంబంధాలు తిరిగి ప్రారంభం కావని.. ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఆదివారం ఉదయం భారత వాయుసేన కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందంటూ భారత వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది.
జమ్మూకశ్మీర్ విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందన్న భారత విదేశాంగ శాఖ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ను అప్పగించడం ఒక్కటే మిగిలి ఉందని తెలిపింది. అంతకు మించి పాకిస్థాన్తో చర్చించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులను అప్పగించే విషయమై వారు చర్చించాలనుకుంటే.. ఆ విషయంపై చర్చించేందుకు సిద్ధమేనని తెలిపింది. ఇతర అంశాలపై పాకిస్థాన్తో చర్చించే ఉద్దేశం తమకు లేదని భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశాయి. ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవటం లేదని భారత విదేశాంగశాఖ తేల్చి చెప్పింది.
మే నెల 7న పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన అనంతరం.. పాక్ డీజీఎంవోకు సమాచారం ఇచ్చామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తే.. పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన తర్వాత మే 10న పాకిస్థాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చిందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక భారత సైన్యం జరిపిన దాడుల్లో రహిమ్యార్ఖాన్ వైమానిక స్థావరం రన్వే నేలమట్టమైందని తెలిపింది. బహావల్పూర్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం కూల్చివేశామని.. పాకిస్థాన్ను బలంగా, భారీగా దెబ్బతీశామని వెల్లడించింది.
పాకిస్థాన్ వైపు నుంచి బుల్లెట్లతో దాడి చేస్తే.. మనం బాంబులతో బదులిచ్చామంటూ.. భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్తో పోరులో పాకిస్థాన్ ప్రతి రౌండ్లో దెబ్బతిందని.. ప్రతి రౌండ్లో ఓడిపోయిందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఎయిర్ బేస్ల మీద భారత్ దాడుల తర్వాత.. పాకిస్థాన్ పరిస్థితి ఏమిటో వారికి అర్థమైందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa