ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతన్ని నిందించొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ

national |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 07:28 PM

విక్రమ్ మిస్రీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. శత్రుదేశం పాకిస్థాన్ కుట్రలను భారత సైన్యం ఎలా తిప్పికొడుతోందనే వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు వివరిస్తూ వచ్చారు. ప్రతిరోజూ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో పాటు విలేకర్ల సమావేశం నిర్వహిస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్తతల గురించి.. పాకిస్థాన్ చేస్తున్న దుష్ర్పచారం గురించి, భారతదేశం వైఖరిని ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు వివరిస్తూ వచ్చారు. అయితే విదేశాంగ శాఖ కార్యదర్శి్ విక్రమ్ మిస్రీపైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. భారత్ పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటన అనంతరం విక్రమ్ మిస్రీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అయితే విక్రమ్ మిస్రీపై జరుగుతున్న ట్రోలింగ్ మీద ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. విక్రమ్ మిస్రీపై జరుగుతున్న ట్రోలింగ్‌పై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు.


" విక్రమ్ మిస్రీ, నిజాయితీపరుడైన మంచి అధికారి. కష్టపడి పనిచేసే దౌత్యవేత్త, మన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కార్యనిర్వాహక వర్గం కింద పనిచేస్తారు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే కార్యనిర్వాహక వర్గం లేదా దేశాన్ని నడుపుతున్న రాజకీయ నేతలు తీసుకునే నిర్ణయాలకు వారిని నిందించడం సరికాదు" అంటూ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు ట్రోలింగ్ కారణంగా విక్రమ్ మిస్రీ తన ఎక్స్ అకౌంట్‌ను ప్రొటెక్ట్ చేసుకున్నట్లు తెలిసింది. విక్రమ్ మిస్రీ తన అకౌంట్‌ను దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నారని.. రైట్ వింగ్ ట్రోలర్స్ ఆయనను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి పాత ట్వీట్‌లను వెలికితీసున్నారంటూ ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు. దీనికి అసదుద్దీన్ ఒవైసీ రిప్లై ఇచ్చారు.


మరోవైపు కాంగ్రెస్ నేత సల్మాన్ అనీస్ సోజ్ కూడా విక్రమ్ మిస్రీని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. కశ్మీరీ అయిన విక్రమ్ మిస్రీ దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవను ఎంత ట్రోలింగ్ చేసినా తగ్గించలేరని.. ధన్యవాదాలు చెప్పలేకపోతే, నోరు మూసుకోవడం నేర్చుకోండంటూ ట్రోలర్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు సల్మాన్ అనీస్ సోజ్..


విక్రమ్ మిస్రీ గతంలో భారత్ చేపట్టిన అనేక మిషన్లలో పనిచేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. గతేడాది జూలైలో విక్రమ్ విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఆపరేషన్ సిందూర్ గురించి ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు సరైన సమాచారం అందిస్తూ వచ్చారు. అలాగే పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని వివరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే భారత్ పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa