జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులతో విరుచుకుపడింది. భారత్ సైనిక చర్యను జీర్ణించుకోలేకపోయిన పాకిస్థాన్.. భారత్ సరిహద్దుల్లోని డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి యత్నించింది. దీంతో భారత సైన్యం ఈ దాడులను సమర్ధవంతంగా అడ్డుకుని.. తిప్పికొట్టింది. నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.
అమెరికా మధ్యవర్తిత్వం – ట్రంప్ అభినందన
ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత రెండు రోజులుగా జరిగిన చర్చల ఫలితంగా శనివారం తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యక్షంగా మాట్లాడినట్లు సీఎన్ఎన్ నివేదికలు పేర్కొన్నాయి.
పాకిస్తాన్ మరోసారి ఒప్పందానికి తూట్లు
విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘనకు పాల్పడింది. శ్రీనగర్లో శనివారం సాయంత్రం బాంబు శబ్దాలు వినిపించగా, ఉదంపూర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో వైమానిక దాడులకు సంకేతంగా సైరన్లు మోగాయి. శ్రీనగర్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు గాల్లోకి కాల్పులు జరిపాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ. ‘‘ఇది కాల్పుల విరమణ కాదు... శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలు! ఇదెక్కడి విరమణ?’ అ ట్వీట్ చేశారు.
డ్రోన్లు, ఆక్రమణలు.. భారత బలగాలు అప్రమత్తం
శనివారం రాత్రి పాకిస్తాన్ నుంచి డ్రోన్లు భారత్లోకి ప్రవేశించగా, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో బ్లాక్అవుట్లు అమలుచేశారు. నాగ్రోటా మిలటరీ స్టేషన్లోని ఒక సెంట్రీ అప్రమత్తంగా స్పందించి మిలటరీ శిబిరంపై దాడిని అడ్డుకున్నాడు. దీంతో స్వల్ప కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో జవాన్కు గాయాలయ్యాయి.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రకటన
‘గత కొన్ని గంటలుగా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరావృతంగా ఉల్లంఘించింది. భారత సైన్యం తగిన చర్యలు తీసుకుంటోంది. పాక్ తక్షణమే పరిస్థితిని అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలి’ అని మీడియా సమావేశంలో విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రి తెలిపారు.
అజిత్ దోవల్కు చైనా విదేశాంగ మంత్రి ఫోన్
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్లో మాట్లాడారు. ‘పహల్గామ్ దాడిలో తీవ్ర నష్టం జరిగింది. భారత్ యుద్ధానికి ఆసక్తి లేదు కానీ ఉగ్రవాదాన్ని సహించలేం’ అని దోవల్ స్పష్టం చేశారు. ‘ప్రాంతీయ స్థిరత్వం, శాంతి పునరుద్ధరణకు భారత- పాక్ నిబద్ధత చూపాలి’ అని చైనా మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
భారత్ కొత్త భద్రతా మౌలిక విధానం
కాల్పుల విరమణ గురించి భారత్ ప్రకటిస్తూ.. ఇకపై ఉగ్రదాడిని ‘యుద్ధ చర్య’గా పరిగణించి, తగిన ప్రతిస్పందన ఇస్తామని ప్రకటించింది. ఇది భద్రతా మౌలిక విధానంలో కీలక మార్పు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa