ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా, చైనా ట్రేడ్ వార్‌లో ట్విస్ట్.. ఇరుదేశాల మధ్య ఒప్పందం

international |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 09:02 PM

గత కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో మరింత తీవ్రమైంది. ఒకదానిపై ఒకటి భారీ టారిఫ్‌లు (100% కంటే ఎక్కువ) విధించడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దిగజారాయి. ఈ క్రమంలో అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. అమెరికా, చైనా మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధాన్ని నివారించేందుకు జరిపిన చర్చల్లో కొంత పురోగతి సాధించామని తెలిపారు. అయితే, జెనీవాలో రెండు రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ముగిసిన తరువాత ఒప్పంద గురించి తాజాగా ప్రకటన వెలువడింది. ఇరు దేశాలూ 90 రోజుల పాటు ఒప్పంందం అమల్లో ఉంటుంది. అలాగే, అమెరికా వస్తువులపై సుంకాలను 125 నుంచి నుంచి 10 శాతానికి చైనా.. చైనా వస్తువులపై 145 నుంచి 30 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించారు.


చర్చల వివరాలను సోమవారం వెల్లడిస్తామని బెసెంట్ పేర్కొన్నారు. ఈ చర్చల వివరాలను అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా తెలుసుకున్నారని కూడా చెప్పారు. ఈ చర్చల్లో అమెరికా తరఫున బెసెంట్‌తో పాటు వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రియర్.. డ్రాగన్ తరఫున చైనా వైస్ ప్రీమియర్ హే లిఫెంగ్, ఇద్దరు చైనా డిప్యూటీ మంత్రులు పాల్గొన్నారు. ఈ చర్చల ముగింపును ‘చైనా భాగస్వాములతో కుదుర్చుకున్న ఒప్పందం’గా వర్ణించారు. ఇది 1.2 ట్రిలియన్ డాలర్లు అమెరికా అంతర్జాతీయ వస్తు వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్.. పలు దేశాలతో అమెరికా చర్చలు సాగిస్తోన్న విషయం తెలిసిందే.


‘రెండు రోజుల పాటు చాలా నిర్మాణాత్మకంగా చర్చలు సాగాయి... ఒప్పందానికి త్వరగా చేరుకున్నామంటే అనుకున్నంత పెద్ద విభేదాలు ఉండకపోవచ్చు’ అని గ్రియర్ చెప్పారు. చైనా ప్రతినిధులు ‘కఠినంగా ఒప్పించగలిగే నేర్పరులు’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి 100 శాతానికి పైగా టారిఫ్‌లు విధించుకున్న తర్వాత.. అమెరికా, చైనా ప్రతినిదుల మధ్య జరిగిన మొట్టమొదటి ప్రత్యక్ష సమావేశం ఇది. ఇప్పటికే సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని బెసెంట్ అన్నారు.


ఇటీవల వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన మాట్లాడుతూ.. చర్చల్లో పాల్గొనడానికి చైనా సిద్ధంగా ఉందని, అమెరికాతో వాణిజ్య సంబంధాలను సమతుల్యంగా చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. త్వరలోనే ఇతర దేశాలతో కూడా విదేశీ వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాణిజ్య సంబంధాలను పునఃస్థాపించడంలో బీజింగ్ ఆసక్తిగా ఉందని చెప్పారు.


ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్‌తో కుదిరిన ఒప్పందాన్ని ఉదాహరణగా చెప్పారు. వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్‌నిక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జేమిసన్ గ్రియర్ నేతృత్వంలోని యూఎస్టీఆర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న రెండు డజన్ల ఒప్పందాలపై పని చేస్తోంది. ‘వాటిలో ప్రతి ఒప్పందం యూకే ఒప్పందం మాదిరిగానే ఉన్నా, ఒక్కోటి ప్రత్యేకంగా ఉంటుంది’ అని హాసెట్ అన్నారు. అయితే, అమెరికాాతో ఒప్పందం చేసుకునే దేశాలకు చైనా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఇదే సమయంలో, ట్రంప్ కూడా చర్చలపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. ‘చర్చలు స్నేహపూర్వకమైన, కానీ నిర్మాణాత్మకమైన విధంగా జరిగిన ప్రక్రియ’ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ‘చైనాతో స్విట్జర్లాండ్‌లో జరిగిన సమావేశంలో అనేక విషయాలు చర్చించాం.. చాలా అంశాలపై ఒప్పందానికి వచ్చాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇరు దేశాలకు ప్రయోజనం జరిగేలా అమెరికా వ్యాపారానికి చైనా తలుపులు తెరుచుకోవాలని మేము కోరుకుంటున్నాం. గొప్ప పురోగతి సాధించాం!!!" అని ట్రంప్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa