ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌కి లగ్జరీ విమానం గిఫ్ట్ ఇస్తోన్న ఖతార్ ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 08:53 PM

రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ పర్యటనకు రానుండగా.. ఖతార్‌ రాజ కుటుంబం నుంచి ఖరీదైన బహుమతి అందుకోనున్నారు. విలాసవంతమైన 747-8 విమానాన్ని ట్రంప్‌కు అందజేయనున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌‌కు తగ్గట్టుగా దీనిలో మార్పులు చేయనున్నారు. ట్రంప్ 2029 జనవరిలో అధ్యక్ష పీఠం దిగిపోయేవరకూ ఈ విమానాన్ని ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షనుగా వినియోగిస్తారు. అనంతరం అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్‌కు అప్పగిస్తారు. ఖతార్‌‌లో పర్యటించే సమయంలో ఈ కానుకను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విమానం విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3400 కోట్లు) ఉంటుంది. కాగా, ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఖతార్ పాలకులు ఒకరు. ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చిన ఖతార్ పాలకుడికి మోదీ స్వయంగా వెళ్లి స్వాగతం చెప్పారు.


అయితే, దీనిపై ఖతార్‌ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఉపయోగించుకునేలా ఒక విమానాన్ని అందజేయడంపై అమెరికాతో చర్చలు జరిగాయి’ అని అంగీకరించింది. కానీ, .ఇది గిఫ్ట్ అనే పదం వాడలేదు. ఈ ప్రకటన తర్వాత ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం Truth Social‌లో పెట్టిన పోస్ట్ కానుకను స్వీకరిస్తున్నట్టు ధ్రువీకరించేలా ఉంది.


అంతకుముందు ఏబీసీ మీడియా.. అనేక వర్గాలను ఉటంకిస్తూ.. ఖతారీ రాజ కుటుంబం అందించబోయే సుమారు 400 మిలియన్ డాలర్లు విలువగల బోయింగ్ 747-8 విమానం.. ‘ఎయిర్ ఫోర్స్ వన్”గా ఉపయోగించడానికి ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం చేసినట్టు నివేదించింది. ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్క్ చేసి ఈ విమానాన్ని ట్రంప్ సందర్శించినట్టు తెలిపింది. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఓ రకంగా లంచమే? అని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.


‘అమెరికా ఫస్ట్’ అంటే ఇలానా?: ఖతార్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం అందించడమేనా?.. ఇది కేవలం లంచం మాత్రమే కాదు.. అదనపు ప్రయోజనం.. విదేశీ ప్రభావం’ అని డెమొక్రాట్ నేత ,సెనెట్ మైనార్టీ లీడర్ చక్ షూమర్ ఆక్షేపించారు. ‘విదేశాల నుంచి కానుకలను స్వీకరించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని మన రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని, విమానం నాలుగు సంవత్సరాలు వాడుకుని తర్వాత అధ్యక్ష లైబ్రరీకి పంపినా అది లంచంగానే పరిగణిస్తారు’అని మరో ప్రతిపక్ష సభ్యుడు, మెరిల్యాండ్‌ డెమొక్రాట్ కాంగ్రెస్‌మెన్ జేమీ రాస్కి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa