ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌ను సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టా పోస్ట్.. తిక్క కుదిర్చిన సైబరాబాద్ పోలీసులు

Crime |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 09:06 PM

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడగా.. భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని పౌరులందరూ బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది. శత్రుమూకలతో పోరాడుతున్న మన సైనికులకు అండగా నిలవాలి. కానీ కొందరు దేశద్రోహులు.. ఇక్కడి గాలి పీల్చుతూ, ఈ గడ్డ మీద బతుకుతూ.. శుత్రదేశానికి వత్తాసు పలుకుతున్నారు. పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రెండ్రోజుల క్రితం ఓ డిగ్రీ విద్యార్థిని పాకిస్తాన్‌కు మద్దతుగా పోస్టు పెట్టగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.


తాజాగా.. మరో యువకుడు పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ.. ఇండియానూ వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. హైదరాబాద్ శివారు పాలమాకుల గ్రామానికి చెందిన 25 ఏళ్ల సయ్యద్ ఇక్రముద్దీన్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ పోస్టు చేశాడు. భారతదేశానికి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాసుకొచ్చాడు. ఈ చర్య పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్రముద్దీన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు యువకుడి తిక్క కుదిర్చారు. దేశానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టిన సయ్యద్ ఇక్రముద్దీన్‌పై కేసు నమోదు చేశారు.


ఇండియా- పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో.. ఇలాంటి దేశ వ్యతిరేక పోస్టులు పెట్టటం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియా పోస్టులను నిశితంగా పరిశీలిస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని.. చట్టవిరుద్ధమైన పోస్టులు పెట్టడం నేరమని పోలీసులు సూచిస్తున్నారు.


కాగా, ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. కాల్పులు విరమించినప్పటికీ ఇరు దేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయి. నేడు మధ్యాహ్నం రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో శాంతి నెలకొంటుందా? లేదా ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతాయా? అనేది వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa