కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన గెడ్డం రామరాజు, రాజమహేంద్రవరానికి చెందిన వెంకట సుబ్బారావు, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడకు చెందిన గోనా శివశంకర్, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన వారాడ సుధీర్, ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన హేక్ హజరత్ అలీ రాజమహేంద్రవరంలోని అపోలో ఫార్మసీ ఉద్యోగులు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన కంపెనీ సమావేశానికి హాజరై రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కాకినాడ జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామరాజు(38), సుధీర్(36), హజరత్ అలీ(35) అక్కడికక్కడే మృతి చెందగా వెంకట సుబ్బారావు, శివశంకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇసుప కడ్డీల లోడు లారీని నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతుల్లో షేక్ హజరత్ అలీకి ఇటీవలే వివాహమైనట్టు కుటుంబీకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa