ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న నిర్లక్ష్యం ఖరీదు 17 నిండు ప్రాణాలు

Crime |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 08:48 PM

ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ ఉలిక్కిపడింది. నగరంలోని పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున.. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ దారుణ సంఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్,కేటీఆర్ తదితరులు స్పందించి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలానే కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటంచింది.


ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణంలో ఉన్న ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ పేలడం వల్లే ఈ దారుణ జరిగిందని అధికారులు ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. దీని కారణంగా విషపూరితమైన వాయువులు, దట్టమైన పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.


చిన్న నిర్లక్ష్యం వల్లే భారీ ప్రాణనష్టం..


అయితే మృతుల సంఖ్య ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం చిన్న నిర్లక్ష్యం అంటున్నారు అధికారుల. బిల్డింగ్లో ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందనే అభిప్రాయానికి వచ్చారు. అంతేకాక ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయన్నారు. కరెంట్ షాక్ వల్ల చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని చెప్పారు.


పైగా ఇంత పెద్ద ఇంటికి ఒక్కటే ఎగ్జిట్ ఉందని.. బయట ద్వారం చాలా విశాలంగా ఉండి.. లోపల మాత్రం చాలా ఇరుగ్గా ఉందని.. మెట్లు కూడా సరిగ్గా లేవని అధికారులు తెలిపారు. ఇక తెల్లవారుజామున ప్రమాదం జరగడం వల్ల కూడా ప్రాణనష్టం అధికంగా సంభవించింది. అంటున్నారు అధికారులు. అందరూ మత్తుగా నిద్రపోయి ఉన్నారని.. ప్రమాదం గురించి తెలిసినా.. నిద్ర మత్తులో ఉన్న కారణం చేత సరిగా స్పందించలేదని.. షాక్ నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. ఫైర్ ఎగ్జిస్ట్ లేని కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.


ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు, మిగిలిన వారు పురుషులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com