ఏఐ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ టాయిలెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని, ఇవి మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేస్తాయని ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, పద్మ విభూషణ్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కర్నూలు పర్యటనకు విచ్చేసిన ఆయనను స్థానిక వైద్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆధునిక వైద్య విధానాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.గతంలో గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలే ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయని భావించేవారని, కానీ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి "గట్ హెల్త్" (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కీలకమని స్పష్టమైందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. మన శరీరంలోని మైక్రోబయోమ్.. బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల సమూహం. శరీర విధులను నియంత్రిస్తూ గట్ హెల్త్ను, తద్వారా పూర్తి శారీరక ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుందని తెలిపారు. ఈ సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిని, హానికారక బ్యాక్టీరియా పెరిగితే అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. గట్ హెల్త్ అనేది వైద్యశాస్త్రంలో ఒక సరికొత్త, కీలకమైన అంశంగా మారిందన్నారు.శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి రెండు మార్గాలున్నాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రోబయాటిక్స్ ద్వారా నేరుగా మంచి బ్యాక్టీరియాను అందించవచ్చని, పెరుగు, మజ్జిగ వంటివి ఇందుకు ఉదాహరణలని చెప్పారు. ఇక ప్రీబయాటిక్స్ అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఉల్లిపాయలు, అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు వంటివి ప్రీబయాటిక్స్గా పనిచేస్తాయని వివరించారు. రోజూ రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని సూచించారు.గట్ హెల్త్కు, గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే ‘టీఎంఏఓ’ అనే రసాయనం శరీరంలో ఎక్కువైతే గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు రావొచ్చని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాను నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గించుకోవచ్చన్నారు. అదేవిధంగా అల్జీమర్స్ వ్యాధి, మెదడు పనితీరు, తెలివితేటలు కూడా బ్యాక్టీరియాతో ముడిపడి ఉన్నాయని, బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా వీటికి చికిత్స చేసే పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు.త్వరలోనే ఏఐ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ టాయిలెట్లు అందుబాటులోకి వస్తాయని, ఇవి మన మల, మూత్రాలను విశ్లేషించి ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి సమాచారం అందిస్తాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. అలాగే, స్టూల్ క్యాప్సూల్స్ ద్వారా అనేక జబ్బులను నయం చేయవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతుల మలాన్ని సేకరించి, దాన్ని శుద్ధి చేసి, పొడి రూపంలోకి మార్చి క్యాప్సూల్స్లో అందిస్తారని, దీనివల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియాను ప్రవేశపెట్టవచ్చని వివరించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa