ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..: ప్రొఫెసర్‌పై సుప్రీం పైర్

national |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:23 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా అశోకా యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ ముహ్మూదాబాద్ సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టు పెట్టారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు ఆపరేషన్ సిందూర్‌లో ఏం జరిగిందో చెప్పకుండా.. ప్రజలకు ఏం కావాలో అది మాత్రమే చెప్పారని ఆరోపించారు. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కాగా.. ఓ బీజేపీ నాయకుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈయన్ను సుప్రీం కోర్టుకు తీసుకెళ్లగా.. ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాక్షసులు వచ్చి దేశంపై దాడి చేస్తుంటే ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేయడం అవసరమా అంటూ వ్యాఖ్యానించింది.


హర్యానాలోని సోనీపట్ జిల్లా ఆశోకా యూనివర్సిటీలో అలీఖాన్ ముహ్మూదాబాద్ రాజనీతి శాశ్త్ర విభాగాధిపతిగా పని చేస్తున్నారు. అయితే ఈయన ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఓ అభ్యంతరక పోస్టు పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌పై బ్రీఫింగ్ ఇచ్చిన ఇద్దరు మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లను అలీఖాన్ తప్పు పట్టారు. వీరిద్దరూ జరిగింది జరిగినట్లుగా మీడియాకు వివరించలేదని.. దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మాత్రమే చెప్పారంటూ వెల్లడించారు. ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న వారు క్షేత్ర స్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలని.. కానీ ఈ ఇద్దరు అధికారులు అలా చేయలేక పోయారన్నారు. ఇలా నిజాలను నిక్కచ్చిగా చెప్పలేకపోవడం కూడా వంచనే అని వెల్లడించారు.


దీనిపై ఓ బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ప్రొఫెసర్ అలీఖాన్ ముహ్మూదాబాద్‌ను అరెస్ట్ చేశారు. ఆపై స్థానిక కోర్టులో విచారణ కూడా సాగగా.. తనకు బెయిల్ మంజూరు చేసిన విచారణ నిలిపి వేయాలంటూ ఇటీవలే అలీఖాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కొటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అలీఖాన్ తరఫు న్యాయవాది కపిల్ సిబిల్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ ఆ పోస్టులో నేరపూరిత ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయన్నారు. ఆయన వాదనపై స్పందిస్తూ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు.


అసలు ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండని.. భావ వ్యక్తీకరమ చేసే హక్కు ఉంటుందన్నారు. కానీ ఆ విషయం గురించి మాట్లాడే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అందరూ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. కానీ బాధ్యతల గురించి ప్రస్తావించడం లేదన్నారు. భావ వ్యక్తీకరణ చేసే హక్కు కచ్చితంగా ఉంటుందని కానీ వీటన్నింటి గురించి సమయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కొందరు రాక్షసులు వచ్చి భారత్‌పై దాడి చేశారు. ఇప్పుడు మనమంతా ఐక్యంగా ఉండాలని.. ఇలాంటి సమయంలో పబ్లిసిటీ పొందేందుకు ప్రయత్నాలు ఎందుకన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa