ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాలో 19 వేల మంది చిన్నారులను చంపేశారు..: ఇజ్రాయెల్ ఎంపీ

international |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 08:51 PM

ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలతో వేలాది మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, హమాస్ జరుపుతున్న దాడుల్లో ఇజ్రాయెల్‌లోని పౌరులు కూడా ప్రాణనష్టం ఎదుర్కొంటున్నారు. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె అక్కడి పార్లమెంటులో గళమెత్తారు. గాజాపై టెల్‌అవీవ్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.


"దాదాపు ఏడాదిన్నర కాలంగా మీరు 19 వేల మంది చిన్నారుల ప్రాణాలు తీశారు. 53 వేల మంది నివాసితులను చంపేశారు. అన్ని విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులను నాశనం చేశారు. అయినా.. రాజకీయంగా విజయం సాధించామనే భావనకు రాలేకపోతున్న పిచ్చివాళ్లు మీరు" అని ఎంపీ ఐమన్ ఒడె తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో అక్కడి అధికారులు ఐమన్‌ ఒడెను పోడియం నుంచి పక్కకు లాక్కెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు ోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఎంపీ ఐమన్ ఒడె చేసిన వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఐమన్ ఆరోపణలను పార్లమెంటులోని కొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడి అధికారులు పోడియం నుంచి పక్కకు లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రం చేసింది. దీంతో టెల్‌అవీవ్‌ చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఐడీఎఫ్ విశ్రాంత చీఫ్ యాయిర్ గొలాన్ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇటీవల మండిపడ్డారు. చిన్నారులను చంపడం హాబీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఐడీఎఫ్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశ నేత మోషే ఫైగ్లిన్ స్పందించిన విషయం తెలిసిందే. యాయిర్ గొలాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మోషే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమ శత్రువు గాజాలోని హమాస్, దాని మిలిటరీ వింగ్ మాత్రమే కాదని, గాజాలోని ప్రతి బిడ్డా తమకు శత్రువే అంటూ వ్యాఖ్యానించారు. గాజా నగరాన్ని ఆక్రమించుకుని, అక్కడ స్థిరపడాలని, గాజాలో ఒక్క బిడ్డ కూడా మిగలదని, అంతకు మించిన విజయం మరోటి లేదని పేర్కొన్నారు.


2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయాని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. గాజా ప్రాంతంలో మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. మరోవైపు.. గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని నెతన్యాహు ప్రకటించారు. ఆ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa