ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగిల్ టికెట్‌తో విశాఖ సిటీ చుట్టేయొచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 06:32 PM

విశాఖపట్నం వాసులకు, అలాగే విశాఖను సందర్శించే టూరిస్టులకు డబుల్ ధమాకా.. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు విశాఖ వీధుల్లో చక్కర్లు కొట్టనున్నాయి. విశాఖపట్నంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, అలాగే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు గానూ గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్.. హాప్ ఆన్ హాప్ ఆఫ్ (HOHO) బస్సులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. పర్యాటకులతో పాటుగా స్థానికులకు కూడా సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (GVSCCL) ఈ ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా విద్యుత్తుతో నడిచే రెండు డబుల్ డెక్కర్ HOHO బస్సులను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందులో ఒకటి ఎయిర్ కండిషన్డ్ కాగా.. మరొకటి నాన్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సు. ఈ మేరకు రెండు డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసేందుకు జీవీఎస్‌సీసీఎల్ ప్రతిపాదనలను కోరుతోంది.


ఈ రెండు డబుల్ డెక్కర్ బస్సులను విశాఖపట్నంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల మీదుగా నడపనున్నారు. పర్యాటక శాఖ భాగస్వామ్యంతో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టాలని జీవీఎంసీ ఆలోచిస్తోంది. విశాఖలోని ముఖ్యమైన ప్రదేశాలను చుట్టేసేలా ఈ బస్సులను తీసుకువస్తే పర్యాటకులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కరోజులోనే విశాఖలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను చుట్టేయాలనుకునేవారికి ఈ హోహో డబుల్ డెక్కర్ బస్సులు అనుకూలంగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణంతో విశాఖ అందాలను ఆస్వాదించవచ్చు. అలాగే అటు స్థానికులకు కూడా ఉపయోగపడతాయి.


ఏంటీ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సుల ప్రత్యేకత


హాప్ ఆన్ హాప్ ఆఫ్ విధానం వలన ప్రయాణికులు ఒకచోట బస్సు ఎక్కి, తమకు ఇష్టమైన ప్రదేశంలో దిగొచ్చు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించిన తర్వాత.. ఆ వెనుక వచ్చే బస్సులో తిరిగి ప్రయాణించే వీలుంటుంది. దీంతో తమకు ఇష్టమైన చోట దిగి.. మళ్లీ వెనుక వచ్చే బస్సులో ఖర్చు లేకుండా ప్రయాణించే వీలును ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ విధానం కల్పి్స్తుంది. ఇక ఈ బస్సులు విద్యుత్ ఆధారంగా నడుస్తాయి. దీంతో పర్యావరణ కాలుష్యం ఉండదని అధికారులు చెప్తున్నారు. డబుల్ డెక్కర్ బస్సులు కావటంతో బస్సులో ప్రయాణిస్తూ అద్దాల మధ్య నుంచి విశాఖ అందాలను వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే విశాఖలో ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు,


విశాఖపట్నానికి మనదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా సందర్శకులు వస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ బస్సులను తేవాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ బస్సులను ఆర్కే బీట్, తోట్లకొండ, టీయూ- 142 , రుషికొండ బీచ్, తెన్నేటి పార్క్, కైలాసగిరి, సింహాచలం ఆలయం, భీమిలి బీచ్ నడిపే ఆలోచనలో ఉన్నారు. పర్యాటకులకు ఆ ప్రాంత విశేషాలను వివరించేందుకు గైడ్ లేదా ఆడియో, వీడియో ప్రజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వస్తే ఒక్క టికెట్‌తో విశాఖలోని ప్రముఖ ప్రాంతాలను అన్నింటినీ చుట్టేసిరావచ్చు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa